వడ్ల కొనుగోలుపై ఢిల్లీకి అఖిలపక్షం… బిజెపి ఎమ్యెల్యే సవాల్!

కేసీఆర్ వెంటనే మంత్రులను ఢిల్లీ నుండి పిలిపించి, రైతు పండించే ప్రతి గింజ కొనేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు సవాల్ చేశారు. అప్పుడు వారితో కలిసి తాము కూడా ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేసారు. 
ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొంటూ  మంత్రులకు ఢిల్లీలో ఇంకా ఏం పని? రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారా? గల్లీలో పని లేక ఢిల్లీకి వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వడ్ల కొనుగోలను కావాలనే ఆలస్యం చేస్తుందని ధ్వజమెత్తారు.
 
ప్రజలను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వచ్చారని బరాబర్‌ అడుగుతామని చెప్పారు. రైతులను అడ్డం పెట్టుకుని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బియ్యాన్ని దొంగదారి పట్టిస్తున్నారని, పక్కా రాష్ట్రాల నుండి దొంగదారి లో బియ్యాన్ని తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు.
 
తెలంగాణ ప్రభుత్వానికి రైతుల పైన ప్రేమ లేదని, 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం,రా రైస్ కేంద్రానికి ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. యాసంగి ప్రతి గింజను కొంటుంది అని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు.  
 
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పడం పట్ల  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ శాఖమంత్రి ఎం మాట్లాడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని చెప్పారు.  మీరు కొన్న వడ్లను ఎప్పుడు బియ్యంగా ఇస్తారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రశ్నించారు.
రాష్ట్రం నుంచి లేఖ రాలేదని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని వడ్ల పంచాయితీ తెలంగాణలో ఎందుకు వచ్చిందని సీఎంను ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలున్న కావాలనే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.

హుజురుబాద్ ఎన్నికల బదాలయింపుగా సీఎం పగ సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మెడ మీద కత్తి పెట్టారు అని అంటున్నారు…మీ మెడ మీద కత్తి పెట్టింది ఎవరు..? రైతుల కోసం కేసీఆర్ ఎందుకు మెడ కోసుకోలేదు? అంటూ రఘునందన్ నిలదీశారు. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తామని తాము చెప్పలేదని, వారి పై ఏ కుంభకోణం ఉందొ వారే చెప్తే బాగుంటుందని సీఎంని ఎద్దేవా చేశారు. 

హుజురాబాద్ లో ఈటెల రాజేంద్ర గెలుపు తో తెలంగాణ మంత్రులకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొంటూ గతంలో కేసీఆర్, కేటీఆర్ లేకపోతే మంత్రులు ఢిల్లీ వచ్చే వారు కాదని గుర్తు చేశారు. కామారెడ్డి లో రైతు చనిపోతే అది మీకు వార్త కాదా తెలంగాణ ఆత్మగౌరవం ఇదేనా అంటూ కేసీఆర్ ను నిలదీశారు. ఒక్క యూరియా గింజకుడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఫ్రీగా ఇవ్వలేదని ఆరోపించారు