తెలంగాణలో 20 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరింది. కొత్తగా నమోదైన 12 ఒమిక్రాన్ కేసులలో 9 మంది విదేశీయులు, ముగ్గురు భారతదేశానికి చెందినవారు ఉన్నారు. 

విదేశీయులలో ఆరుగురు కెన్యా నుంచి రాష్ట్రానికి రాగా, ముగ్గురు సోమాలియా నుంచి, ఇద్దరు యుఎఇ నుంచి, ఒకరు ఘనా నుంచి, ఒకరు టాంజానియా నుంచి రాష్ట్రానికి వచ్చారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి 7,206 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా..శనివారం 315 మంది రాష్ట్రానికి వచ్చారు.

వారిలో ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా, వారి నుంచి నమూనాలు సేకరించి అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటివరకు మొత్తం 25 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా, మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది. 

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,484 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 185 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,430కి చేరింది. శుక్రవారం కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,014కి చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 205 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,761 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇలా ఉండగా, దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 126కు చేరాయి. శనివారం కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో తాజాగా నమోదైన మూడు కేసులతో మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, తెలంగాణలో 20, గుజరాత్‌లో 7, ఏపీ, చండీగఢ్‌, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున కేసులు నమోదయ్యాయి.