ఆర్మీ ఆఫీసర్‌గా అమర జవాను భార్య

ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఆర్మీ జవాను భార్య ఆర్మీ ఆధికారిగా ఎదిగి తన పిల్లలు సహా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. సాధించాలన్న తపన ఉంటే కష్టాలు అందుకు అడ్డంకి కాబోవని నిరూపించిన ఆమె పేరు జ్యోతి దీపక్ నైన్వాల్ (33).

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఆమె భర్త నాయక్ దీపక్ కుమార్ 2018లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడయ్యారు. భర్త మరణంతో కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్టు అయింది. భర్త మరణం ఆమెను కుంగదీసింది. అయితే, అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలు కళ్లముందు కదలాడుతుంటే తమాయించుకున్నారు. 

పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు తల్లి అన్నీ అయి ఓదార్చింది. నీ జీవితం ఇకపై పిల్లలకు ప్రేరణగా నిలవాలని కుమార్తెలో ఆమె ధైర్యాన్ని నింపారు. ఈ పరిస్థితిని కూడా అవకాశంగా మార్చుకోవాలని చెప్పారు. పిల్లలకు ఎవరినో ఉదాహరణగా చూపించే అవకాశం ఇవ్వకుండా వారికి నువ్వే ప్రేరణ కావాలంటూ ఆమెలో అనుక్షణం ధైర్యాన్ని నూరిపోశారు. 

కష్టసుఖాల్లో జీవితాన్ని ఈదుకు రావడమెలానో నిన్ను చూసి వారు నేర్చుకునేలా చేయాలని తల్లి హితబోధ చేశారు. తల్లి నింపిన ధైర్యానికి తోడు, సోదరుడు, మహార్ రెజిమెంట్ మద్దతు ఆమెకు లభించింది. ఫలితంగా ఆర్మీలో చేరాలని జ్యోతి నిర్ణయించుకున్నారు.

తన భర్త స్మృతులను మనస్సులో పెట్టుకుని జ్యోతి నైన్‌వాల్  మూడేళ్ల తర్వాత  సైనికాధికారి అయ్యింది. శనివారం ఆమె 28 మహిళా కెడెట్స్ పాసింగ్ అవుట్ పెరేడ్‌లో తన శిక్షణ ముగించుకుంది. ఆ తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలకు సైనిక యూనిఫారమ్ వేయించి, ఎత్తుకుని తన భర్తను జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ఆ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. 

 బ్రిగేడియర్ సీమ, కల్నల్ ఎంపీ సింగ్ తనకు అండగా నిలిచారని, తనకు మెంటార్లుగా వ్యవహరించారని జ్యోతి గుర్తు చేసుకున్నారు. సర్వీస్ సెలక్షన్ బోర్డుకు ఎంపికయ్యేందుకు వారు తన కోసం చాలా శ్రమించారని పేర్కొన్నారు. జ్యోతి నైన్‌వాల్ ఇప్పుడు లెఫ్టినెంట్ అయ్యింది. తన కుటుంబం నుంచి సైన్యంలో చేరిన తొలి మహిళ ఆమె.

“నా భర్త తాలూకు మహర్ రెజిమెంట్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా బాధ, కష్టకాలంలో వారు నాకు అండగా నిలిచారు. నేనిప్పుడు ఏమైనా సాధించానంటే ఆ రెజిమెంటే కారణం” అని ఆమె పేర్కొన్నారు. జ్యోతి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమె చెన్నై అకాడమీ నుంచి 11 నెలల శిక్షణ పూర్తిచేశారు.

ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ  ఆర్మీ అఫీసర్‌గా చేరడం తన పిల్లలకు గిఫ్ట్ అని అని తెలిపారు. 11 ఏప్రిల్ 2018లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో నాయక్ దీపక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

నాయక్ దీపక్ నైన్‌వాల్ తొమ్మిదేళ్ల కూతురు లావణ్య “నేను దీపక్ నైన్‌వాల్ కూతురునైనందుకు గర్విస్తున్నాను”అని చెప్పింది. తన సోదరుడు రేయాంశ్‌తో కలిసి గ్యాలరీలో కూర్చున్న లావన్య తన తల్లికి చేయి ఊపుతూ ఆనందం కూడా వ్యక్తం చేసింది.