టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడపడితే అక్కడ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టడంపై రగడ మొదలైంది. గత జనవరి నుంచి సిటీలో ఫ్లెక్సీలు, కటౌట్లు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నిస్తోంది.
సిటీని గులాబీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపటాన్ని వ్యతిరేకిస్తూ బుద్ధ భవన్ లోని జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫిస్ వద్ద సిటీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చింది. వివిధ విగ్రహాలకు కూడా టీఆర్ఎస్ తోరణాలను కట్టడాన్ని బీజేపీ ఆక్షేపిస్తోంది.
నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపటాన్ని వ్యతిరేకిస్తోన్న బీజేపీ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ నేతలు తమ ముఖాలు చూసుకోవడానికి మాత్రమే ఫ్లెక్సీలు పనికొస్తాయని కేటీఆర్ గత వ్యాఖ్యలను కమలనాథులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తన ముఖాన్ని చూసుకోవటానికే ఫ్లెక్సీలను కేటీఆర్ ఏర్పాటు చేయించుకున్నాడా? అని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు.
నిషేధం టీఆర్ఎస్ పార్టీకి కాదు ఇతర పార్టీలకు కోసమే నిబంధనలా? సిటీలోని ప్రముఖుల విగ్రహాలకు సైతం టీఆర్ఎస్ తోరణాలను కట్టడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ భవన్ వద్ద చేపట్టనున్న ధర్నాలో బీజేపీ కార్పోరేటర్లు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవంక, ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి పలువురు పౌరులు ప్రయత్నం చేస్తున్నా గత కొద్దీ రోజులుగా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫోన్ నంబర్లు పనిచేయడం లేదు. పని చేసినా ఎవ్వరు సమాధానం చెప్పడం లేదు. ఈ విషయమై ఎటూచెప్పలేక అధికారులు మొఖం చాటేస్తున్నారు.
More Stories
తెలంగాణాలో అన్ని స్థానాల్లో బిజెపి క్లీన్స్వీ ప్
పోలీసుల తీరుపై మాధవీలత అసహనం
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా మోదీ