తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ఆందోళన

తెలంగాణలో నమోదు అవుతున్న రైతు ఆత్మహత్యలపై బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు.  అన్నం పెట్టే రైతులు ఉరికొయ్యలు వేలాడుతున్నా ప్రభుత్వాని పట్టడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగంపై కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదని పేర్కొంటూ టీఆర్ఎస్ సర్కార్‌కు రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ది చెబుతుందని ఆమె స్పష్టం చేశారు. 
 
రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. 
 
2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, రూ. 11,787 కోట్లు ఇచ్చాయి. ఇక 2012–13లో ఏకంగా 121 శాతం, 2013–14లో 103 శాతం ఇచ్చాయి. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక 2014–15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే మాత్రమే ఇచ్చాయని ఆమె తెలిపారు. 
 
అలా క్రమంగా రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం రైతు బంధు ఇస్తున్నామన్న సాకుతో రైతులకు పెట్టుబడి కొరకు బ్యాంకు రుణాల మంజూరుకు ఎలాంటి సూచనలు చేయలేదని ఆమె విమర్శించారు. దీంతో ఈ  వానాకాలం సీజన్‌లో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. 
బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం, వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం చూస్తుంటే రైతుల పట్ల తమకున్న వైఖరి అర్దమవుతుందని విజయశాంతి ధ్వజమెత్తారు. 
 
ఈ వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగైందని ఆమె పేర్కొన్నారు. వాస్తవంగా వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. అయితే వరి సాగైనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని ఆమె చెప్పారు. 
 
ఇక పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ పంట పెట్టుబడికి బ్యాంకులు ఇప్పటివరకు  43.45% మేరకే రుణాలు ఇచ్చాయంటే బ్యాంకుల తీరుకు ప్రభుత్వ వైఖరే కారణమని స్పష్టంగా అర్ధమవుతుందని ఆమె విమర్శించారు. 2018 ఎన్నికలప్పుడు లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకపోవడంతో, ఉన్న అప్పు తీరక, కొత్త అప్పు ఇవ్వడానికి బ్యాంకులు ముందడుగు వేయడం లేదని విజయశాంతి చెప్పారు. 
 
ప్రభుత్వం చేసిన తప్పిదాలకు నేడు తెలంగాణ రైతాంగం నిస్సహాయ పరిస్థితుల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్‌ అప్పులు చేసినట్లు అంచనా ఉండగా… మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని ఆమె తెలిపారు. 
 
వీరికి ప్రైవేట్‌ రుణాలు తప్ప మరో ఆధారం లేదు. దీంతో పెట్టుబడి వ్యయం తలకు మించిన భారంగా మారి చేసిన అప్పులు తీర్చలేక ఉరికొయ్యల‌కు వేళాడుతున్నా వీరి చావులు ప్రభుత్వానికి కనబడుటలేదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.