ఆర్యన్‌ కు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలతో లింకులు!

 బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు ఉన్నాయని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్‌సీబీ) ఆరోపించింది. ‘మత్తు’ పార్టీ నిర్వహిస్తున్న నౌక కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రె్‌సపై దాడుల కేసుకు సంబంధించి ముంబై అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌సింగ్‌ ఈ మేరకు వాదనలు వినిపించారు. 

ఆర్యన్‌ఖాన్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని జడ్జి ఆర్‌.ఎం.నెర్లీకర్‌ను కోరారు. గతంలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్టయిన వ్యక్తులకు మూడు కేసుల్లో బాంబే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. దాంతో న్యాయమూర్తి అనిల్‌సింగ్‌ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. మరోవైపు ఆర్యన్‌ సహా.. మరో ఇద్దరు నిందితులు మున్మున్‌ ధమేచా, అర్బాజ్‌ మర్చంట్‌లను వారంపాటు ఎన్‌సీబీ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

‘‘నిందితుల అరెస్టు సమయంలో వారి వద్ద కమర్షియల్‌ స్థాయిలో మాదకద్రవ్యాలు లభించాయి. ఆర్యన్‌ వద్ద సీజ్‌ చేసిన మొబైల్‌ఫోన్‌ విశ్లేషణ సందర్భంగా.. నాలుగేళ్ల వాట్సాప్‌ చాటింగ్‌ సంభాషణలను గుర్తించాం. అందులో డ్రగ్స్‌ డీలింగ్స్‌కు సంబంధించి, నగదు బదిలీపై కోడ్‌ భాషలో సంభాషణలు ఉన్నాయి.’ అని తెలిపారు.

పైగా, ఈ కేసులో పలు చోట్ల ఎన్‌సీబీ రైడ్స్‌ కొనసాగుతున్నాయని,  ఈ నేపథ్యంలో ఆర్యన్‌, ఇతర నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని చెప్పారు. వారిని విచారించి డ్రగ్స్‌ రాకెట్లకు సంబంధించిన లింకులు, చైన్‌ను గుర్తించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.

అయితే ఆర్యన్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సతీశ్‌ మనెషిండే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ఆ పార్టీకి ఆర్యన్‌ కేవలం ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. ఎన్‌సీబీ దాడుల సమయంలో ఆర్యన్‌ వద్ద ఎలాంటి మత్తుపదార్థాలు లభించలేదు. ఇప్పటి వరకు ఆర్యన్‌ ఎన్‌సీబీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారు.  ఇంకా అతని కస్టడీ పొడిగింపు అవసరం లేదు” అని తెలిపారు.

ఇక వాట్సాప్‌ చాటింగ్‌ విషయానికి వస్తే.. “ఆర్యన్‌ ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్నారు. అవి సాధారణంగా అక్కడి మిత్రులతో జరిపిన చాటింగ్‌లే తప్ప.. డ్రగ్స్‌ రాకెట్లతో ఎలాంటి సంబంధం లేదు. విదేశాల్లో ఉన్నప్పుడు ఎన్నడూ డ్రగ్స్‌ తీసుకోలేదు’’ అని వివరించారు.

దాంతో న్యాయమూర్తి.. ఎవరెవరి వద్ద ఎంత మొత్తంలో డ్రగ్స్‌ దొరికాయని ప్రశ్నించారు. దానికి అనిల్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. ‘‘అర్బాజ్‌ మర్చంట్‌ వద్ద ఆరు గ్రాముల చరాస్‌, మున్మున్‌ వద్ద ఐదు గ్రాముల మాదకద్రవ్యాలు దొరికాయి. మరో నిందితుడి(ఆర్యన్‌ అని చెప్పకుండా..) వద్ద ఐదు గ్రాముల ఎండీఎంఏ లభించింది’’ అని వివరించారు.

ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి.. ఆర్యన్‌, మిగతా ఇద్దరు నిందితులను మూడు రోజుల పాటు ఎన్‌సీబీ కస్టడీకి అనుమతించారు. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెలువరించగానే.. ఆర్యన్‌ కంటతడి పెట్టినట్లు సమాచారం. ఆదివారం అరెస్టు చూపిన మరో ఐదుగురు నిందితులు– నుపుర్‌ సాతిజ, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జైస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రాను కోర్టులో హాజరుపరిచారు. ఈ పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసిన ముంబైకి చెందిన ఓ వ్యక్తిని కూడా న్యాయమూర్తి ముందు నిలబెట్టారు.