విజయవంతంగా రుద్రమ్-2 క్షిపణి ప్రయోగం

విజయవంతంగా రుద్రమ్-2 క్షిపణి ప్రయోగం
స్వదేశీ రక్షణ రంగంలో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ), వైమానిక దళం సంయుక్తంగా ‘రుద్రమ్-2’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి. గగనతలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా జరిపిన పలు రకాల పరీక్షల్లో రుద్రమ్​-2 క్షిపణి అన్ని ప్రమాణాలను అందుకున్నట్టు వెల్లడించారు. క్షిపణి ప్రయోగం తర్వాత మార్గాన్ని స్వయంగా నిర్ణయించుకుని అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు పేర్కొన్నారు.  ఒడిశాలోని చాందీపుర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పథంలో క్షిపణి పరీక్షలు జరిపినట్టు రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. 
 
“చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) వద్ద ఏర్పాటు చేసిన వివిధ రేంజ్ పరికరాలు సేకరించిన ఫ్లైట్ డేటా ద్వారా నిర్ధారించినట్లుగా, అన్ని పరీక్షా లక్ష్యాలు పూర్తిగా నెరవేరాయి,” అని రక్షణ మంత్రిత్వ తెలిపింది. ఈ క్షిపణి వైమానిక దళంలో ఒక గేమ్‌చేంజర్‌గా భావిస్తున్నారు. కొన్నేండ్లుగా వాడుతున్న రష్యా ‘కేహెచ్‌-31’ మిస్సైల్స్‌ పాతబడగా, వీటి స్థానాన్ని భర్తీ చేసేందుకు ‘రుద్రం-2’ను ప్రవేశపెడుతున్నారు.   ‘రుద్రం-2’ శబ్దవేగం కంటే 5.5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. 300 కిలోమీటర్ల పరిధిలో శత్రు దేశాల రాడార్‌ వ్యవస్థలు, కమ్యూనికేషన్‌ నోడ్స్‌, క్షిపణి వ్యవస్థను నాశనం చేయగలదు.
 
క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్​డీఓ, వైమానిక దళం, క్షిపణి తయారీలో పాలుపంచుకున్న ఇతర సంస్థలను ఆయన ప్రశంసించారు. ఈ పరీక్షలు స్వదేశీ రక్షణ సాంకేతికతలలో పెరుగుతున్న పరిపక్వతను నిరూపించాయని, అధునాతన ఆయుధ వ్యవస్థల విషయంలో ‘ఆత్మనిర్భరత’ సాధనకు ఇవి గణనీయంగా దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.  రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి విభాగం కార్యదర్శి,  డీఆర్​డీఓ  ఛైర్మన్  సమీర్ వి. కామత్ కూడా, ఈ ప్రశంసనీయమైన విజయాన్ని సాధించినందుకు ఈ పరీక్షతో అనుబంధం ఉన్న బృందాలన్నింటినీ అభినందించారు.
ఈ క్షిపణి భారత వైమానిక దళానికి ఒక ప్రధాన శక్తి గుణకంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. రుద్రఎం-II ఒక అధునాతన హైబ్రిడ్ గైడెన్స్ నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్), జిపిఎస్-ఆధారిత నావిగేషన్,  విస్తృత శ్రేణిలో రేడియో-ఫ్రీక్వెన్సీ ఉద్గారాలను గుర్తించి, ట్రాక్ చేయగల ఒక అధునాతన పాసివ్ హోమింగ్ సీకర్‌ను ఏకీకృతం చేస్తుంది. ఇది శత్రు రాడార్,  వాయు రక్షణ వ్యవస్థలపై అత్యంత కచ్చితమైన దాడులను చేయడానికి వీలు కల్పిస్తుంది.