ఇకపై భారత్‌లోనే విమాన సర్వీసింగ్‌ కేంద్రాలు

ఇంతవరకు భారత్‌ విమాన సర్వీసింగ్‌లు విదేశాల్లోనే జరిగాయి. ఇకపై భారత్‌లోనే విమాన సర్వీసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. 

భారతదేశంలోని బేగంపేట, తిరుపతి, భోపాల్‌, చెన్నై, ఢిల్లీ, ముంబయిలోని జుహూ, కోల్‌కతా విమానాశ్రయాలను ఎంఆర్‌ఒ (విమాన సర్వీసింగ్‌) కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్రమంత్రిగా సింధియా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన వంద రోజుల కార్యాచరణను ప్రకటించారు.

భారత్‌ను విమాన నిర్వహణ, మరమ్మతు (ఎంఆర్‌ఒ) కేంద్రంగా మార్చడానికి కొత్త విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇంజిన్‌, విమాన సర్వీసింగ్‌ అంతా విదేశాల్లోనే జరుగుతోందని, ఈ వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.  మిలటరీ, పౌరవిమాన సర్వీసింగ్‌ అంతా ఈ ఎంఆర్‌ఒ కేంద్రాల్లోనే నిర్వహించేలా రక్షణశాఖను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

  ప్రస్తుతం భారత్‌లో 710 విమానాలు ఉన్నాయని, వాటి సర్వీసింగు అంతా పై కేంద్రాల్లో జరిగేలా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు. ఉడాన్‌ స్కీంలో కొత్తగా 50 మార్గాలు చేరుస్తున్నామని, ఇందులో 30 అక్టోబరులో మిగిలిన 20 నవంబరు నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. సెప్టెంబరు చివరికల్లా ఎయిర్‌సేవ 3.0 పోర్టల్‌ను ఏర్పాటు చేస్తామని  సింధియా ప్రకటించారు.

ఈ పోర్టల్‌ వల్ల పెండింగులో ఉన్న ఫిర్యాదుల వివరాలు పౌరవిమానయానశాఖ వెబ్‌సైట్‌లో కనిపిస్తాయని చెప్పారు. విమాన ఛార్జీల రీఫండ్‌ బాధ్యతను కేవలం టికెట్‌ ఏజెన్సీలకే పరిమితం చేయకుండా విమానయాన సంస్థకూ అప్పగిస్తున్నామని తెలిపారు. ప్రతి టికెట్‌పై ఎయిర్‌సేవ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, ఫిర్యాదు చేయాలనుకున్నవారు దాన్ని స్కాన్‌ చేసి అక్కడికక్కడే ఫిర్యాదు చేయవచ్చని సింధియా వివరించారు.