ఆదాయపు పన్ను రిటర్న్‌ల గడువు డిసెంబర్ 31

ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్‌) దాఖలుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు సెప్టెంబర్‌ 30 వరకూ ఉన్న గడువును డిసెంబర్‌ 31కి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

సాధారణంగా ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేసేందుకు గడువుతేదీ 2021 జూలై 31కాగా, దానిని గతంలో సెప్టెంబర్‌ 30 వరకూ పెంచిన కేంద్రం మరోదఫా మూడునెలలు పొడిగించింది. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఈ-ఫైలింగ్‌ కొత్త పోర్టల్‌లో పలు సమస్యలు తలెత్తిన నేపథ్యంలో డిసెంబర్‌ నెలాకరువరకూ గడువు పెంచడం గమనార్హం. 

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఐటీ రిట‌ర్న్స్ స‌మ‌ర్పించ‌డంలో ప‌న్ను చెల్లింపుదారులు, ఇత‌ర వాటాదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు గ‌డువును పొడిగించింది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కరోనా సంక్షోభం కారణంగా గతేడాది కూడా ఐటీ రిటర్న్‌ల గడువును కేంద్రం నాలుగు దఫాలు పెంచింది. అలాగే కంపెనీలు త‌మ ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి తుది గ‌డువును న‌వంబ‌ర్ నుంచి 2022 ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు సీబీడీటీ తెలిపింది.

టాక్స్ అడిటింగ్ రిపోర్ట్‌, ట్రాన్స్‌ఫ‌ర్ ప్రైసింగ్ స‌ర్టిఫికెట్ దాఖ‌లు గ‌డువును కూడా 2022 జ‌న‌వ‌రి 15 నుంచి 31 వ‌ర‌కు పొడిగించారు. దీనికి ప్ర‌స్తుతం ఈ ఏడాది అక్టోబ‌ర్ 31 నుంచి న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు గ‌డువు ఉంది. స‌వ‌రించిన ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి మ‌రో రెండు నెల‌లు గ‌డువు.. 2022 మార్చి 31 వ‌ర‌కు గ‌డువు పొడిగించింది సీబీడీటీ.