ఝార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు

జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  అధికారులు సోమవారం వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమవారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించారు. 
 
ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్టుబడిన నగదు విలువ సుమారు రూ.25 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
 
సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడి నివాసంలో కరెన్సీ నోట్ల గుట్టలుగా ఉన్న వీడియో ఫుటేజ్ వైరల్ అవుతోంది. రాంచీలోని సెయిల్ సిటీ సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం సెయిల్ సిటీలో రహదారుల నిర్మాణ శాఖ ఇంజినీర్ వికాస్ కుమార్ నివాసంలో ఓ బృందం… బరియాతు, మొర్హబడి, బొడియాలో వేర్వేరు బృందాలు సోదాలు నిర్వహించాయి.
ఈడీ అధికారులు విడుదల చేసిన వీడియోలో పెద్ద ఎత్తున ఉన్న నోట్లను ఇంట్లో ఎలా ఉంచారో చూడొచ్చు. వాటిలో బ్యాగులు, సూట్‌కేసులు, పాలిథిన్‌లలో చుట్టిన నోట్ల కట్టలు ఉన్నాయి. అయితే వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఈడీ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం అతన్ని ఈడీ అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి కొంతమంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్ డ్రైవ్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
 కాంగ్రెస్ నేత అయిన అలంగీర్ ఆలం.. పకూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చంపెయి సోరెన్ క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి నివాసంలోనే నోట్ల కట్టలు దొరకడంతో బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.  ఝార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ మాట్లాడుతూ.. ‘ఝార్ఖండ్‌లో అవినీతికి అడ్డుకట్టవేయడం లేదు…ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ డ‌బ్బును ఖర్చుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.