కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై 9న తీర్పు

కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై మంగళవారం  సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వకుండా మరో తేదీకి వాయిదా వేసింది. తీర్పును మే 9న ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ లాయర్ తో ‘ఒకవేళ తాత్కాలిక బెయిల్ ఇచ్చినట్లయితే, ఆయన అధికారిక విధులు నిర్వహించకూడదనుకుంటోంది. ఇది కాస్త వైరుధ్యంగా ఉంటుంది.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక‌వేళ మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేస్తే.. అప్పుడు ఎక్సైజ్ పాల‌సీ కేసుతో లింకున్న ఫైల్స్‌ను కేజ్రీ చూడ‌రాదు అని అత్యున్నత న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది.  ‘‘మేము ప్రభుత్వ పనితీరులో జోక్యం కలుగజేసుకోవాలనుకోవడం లేదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఒకవేళ ఎన్నికలు అనేవి లేకున్నట్లయితే ఎలాంటి తాత్కాలిక బెయిల్ ఇవ్వడం కుదరదని కూడా కోర్టు తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని అభిప్రాయపడింది. కేసుల విషయంలో రాజకీయ నాయకులకు మినహాయింపు ఉండకూడదని స్పష్టం చేసింది.

కాగా కోర్టు ఈడి దీర్ఘకాలిక దర్యాప్తుపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్టును అసాధారణంగా కూడా కోర్టు భావించింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి ముందు, తర్వాతి కేసు ఫైళ్లను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించడమేకాక, దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఈడి తరఫు అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు కేసులో కేజ్రీవాల్ ప్రమేయం అన్నది దర్యాప్తు తర్వాత దశలో వెలుగుచూసిందని కోర్టుకు తెలిపారు. ఆయన గోవా అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రస్తావించారు. అప్పట్లో కేజ్రీవాల్ ఓ సెవన్-స్టార్ హోటల్ లో బస చేశారని కూడా తెలిపారు. 

ఆయన ఖర్చులన్నీ ఢిల్లీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ భరించిందని పేర్కొన్నారు. ఇదిలావుండగా సుప్రీంకోర్టు విషయాలు రాబట్టడానికి ఈడి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుందెందుకని ప్రశ్నించింది. సాక్షులను, నిందితిలను సూటిగా ఎందుకు ప్రశ్నించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా కేజ్రీవాల్ బెయిల్ ను తాను వ్యతిరేకిస్తున్నట్లు రాజు కోర్టుకు తెలిపారు.

కాగా, కేజ్రీవాల్‌ కస్టడీని మరోసారి పొడగించింది కోర్టు. మంగళవారంతో కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ను తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన ధర్మాసనం.. కేజ్రీవాల్‌కు మే 20వ తేదీ వరకు కస్టడీని పొడగించింది. దీంతో కేజ్రీవాల్ మరో 14 రోజులు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.