ఈ20 పెట్రోల్ వాడ‌కాన్ని నిషేధించాలి… పంజాబ్ అసెంబ్లీ తీర్మానం

ఈ20 పెట్రోల్ వాడ‌కాన్ని నిషేధించాలి… పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
దేశ‌వ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడ‌కాన్ని నిషేధించాల‌ని కోరుతూ పంజాబ్ అసెంబ్లీలో మంగళవారం ఓ తీర్మానం ఆమోదించింది. 20 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ అమ్మ‌కాన్ని పంజాబ్ అసెంబ్లీ వ్య‌తిరేకించింది. ఇథ‌నాల్ ఫ్రీ పెట్రోల్‌తో పాటు ఈ20 పెట్రోల్ ఎంపిక చేసుకునే అవ‌కాశం వినియోగ‌దారుడికి ఇవ్వాల‌ని స‌భ‌లో డిమాండ్ చేశారు. ఈ20 పెట్రోల్‌కు త‌గిన‌ట్లు డిజైన్ లేని వాహ‌నాల్లో దాన్ని వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ20 వాడ‌కం వ‌ల్ల వాహ‌నాల్లో మైలేజీ త‌గ్గుతుంది కాబ‌ట్టి, ఆ సామ‌ర్థ్యానికి త‌గిన‌ట్లు ఈ20 పెట్రోల్ రిటేల్ ధ‌ర‌ను త‌గ్గించాల‌ని తీర్మానంలో కోరారు.  ఇతర సిఫార్సులతో పాటు, ఈ20 పెట్రోల్ తక్కువ కెలోరిఫిక్ విలువ, తగ్గిన ఇంధన సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా దాని చిల్లర ధర ఉండేలా చూడాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. తద్వారా తక్కువ మైలేజీనిచ్చే ఇంధనానికి వినియోగదారులు అదే ధర చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదని కూడా సూచించింది. 

వాహన అనుకూలత, ఇంధన సామర్థ్యం, ​​నిర్వహణ ఖర్చులు, వినియోగదారుల ఆర్థిక పరిస్థితులు, పర్యావరణ పరిణామాలు, రాష్ట్రాల వారీ ఆందోళనలపై ఈ20 ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి ఆటోమొబైల్ ఇంజనీర్లు, పెట్రోలియం నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, వినియోగదారుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కోరింది.

ముఖ్యమంత్రి భ‌గ‌వంత్‌మాన్ సింగ్ స‌భ‌లో మాట్లాడుతూ సుమారు 45వేల వాహ‌నాల‌పై ఈ20 ప్ర‌భావం గురించి అధ్యయనం చేశార‌ని, ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ వాడ‌డం వ‌ల్ల వాహ‌నాల్లో మైలీజీ త‌గ్గిన‌ట్లు గుర్తించార‌ని, కొన్ని వాహ‌నాలు పాడైన‌ట్లు కూడా  చెప్పారు. అస‌లు ఈ20 విష‌యంలో ప్ర‌ధాని మోదీ ఎందుకు ప‌ట్టుప‌ట్టార‌ని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

కేవ‌లం అమెరికా ప్ర‌భుత్వ వ‌త్తిడి వ‌ల్లే ఈ20 పెట్రోల్ అమ్మ‌కాల‌పై కేంద్రం వ‌త్తిడి తెస్తున్న‌ట్లు భ‌గ‌వంత్ మాన్ ఆరోపించారు. ఇటీవ‌ల అమెరికాతో వంద బిలియ‌న్ల డాల‌ర్ల వాణిజ్య ఒప్పందం కుదిరింద‌ని, దానిలో భాగంగా 5 బిలియ‌న్ల లీట‌ర్ల ఇథ‌నాల్ భార‌త్ కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని  ఆరోపించారు.