మూడో వేవ్ త‌లెత్తినా రిక‌వ‌రీకి ముప్పు లేదు

ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం చివ‌రి మూడు క్వార్ట‌ర్ల‌లో భార‌త్ ఆర్ధిక వృద్ధి మ‌రింత వేగ‌వంత‌మ‌వుతుంద‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జులై, ఆగ‌స్ట్‌లో స్థూల ఆర్థిక సంకేతాలు తిరిగి పుంజుకోవ‌డంతో స‌త్వ‌ర వృద్ధి న‌మోద‌వుతుంంద‌ని అంచ‌నా వేసింది. క‌రోనాతో కుదేలైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడినపెట్టేందుకు ఆర్బీఐ, ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌దుప‌రి మూడు క్వార్ట‌ర్ల‌లో వేగ‌వంత‌మైన రిక‌వరీ సాధ్య‌మవుతుంద‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన ఆగ‌స్ట్ నివేదికలో పేర్కొంది.

ముమ్మ‌రంగా సాగుతున్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ, మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో అనుభ‌వం ద్వారా కొవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ త‌లెత్తినా రిక‌వ‌రీ కొన‌సాగుతుందనే విశ్వాసం నెల‌కొంద‌ని తెలిపింది. విద్యుత్ వినియోగం, రైల్వే స‌రుకు ర‌వాణా, హైవే టోల్, జీఎస్టీ వ‌సూళ్లు వంటి స్ధూల ఆర్థిక సంకేతాలు ఆర్థిక రిక‌వ‌రీ మెరుగ్గా ఉంటుంద‌నే అంచ‌నా వెల్ల‌డిస్తున్నాయ‌ని ఈ నివేదిక‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

ఇలా ఉండగా, క‌రోనా మూడోవేవ్‌ను ఎదుర్కొనేందుకు స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆదేశించారు. ఈ నెలాఖ‌రులో గానీ, వ‌చ్చే నెల‌లో గానీ దేశాన్ని మూడో వేవ్ ముంచెత్తుతుంద‌న్న ఆందోళ‌న మ‌ధ్య ఆదివారం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ‌స‌న్నద్ధం కావాల‌ని పేర్కొన్నారు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ వంటి విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు హిత‌వు చెప్పారు. దేశంలో ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చెందిన తీరును వివ‌రించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ద‌వాఖాన‌ల్లో బెడ్ల సామ‌ర్థ్యం, పిల్ల‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌, వ‌స‌తుల ప‌రిస్థితిని న‌రేంద్ర‌మోదీ స‌మీక్షించారు. వివిధ రాష్ట్రాల‌కు దాదాపు ల‌క్ష ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, మూడు ల‌క్ష‌ల ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. తాజాగా వెలుగు చూస్తున్న క‌రోనా మ్యూటెంట్ల పట్ల నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధికారుల‌ను హెచ్చ‌రించారు.