మూడో వేవ్ ముప్పుపై కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం

కరోనా మూడో వేవ్ ముప్పుపై తెలంగాణ ప్రభుత్వం  పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. హైకోర్టుకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదని ఆమె ఎద్దేవా చేశారు. రాజకీయ మీటింగ్‌లను మాత్రమే పట్టించుకుని ఇతర బహిరంగ  ప్రదేశాలను గాలికి వదిలేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా ఒకవైపు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని గణాంకాలతో సహా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ మాట్లాడుతూ కేసులు పెరుగుతున్న ఏపీ, కేరళ, మహారాష్ట్రల్లోని పరిస్థితులు తెలంగాణకు మాత్రం లేవని, మూడోవేవ్ ముప్పు లేదని పేర్కొనడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
పక్క రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పుడు అవి  తెలంగాణకు వ్యాప్తి చెందకుండా సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలేంటో వెల్లడించలేదని ఆమె విమర్శించారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే మీటింగులలో జనం గుమిగూడి కరోనా వ్యాప్తి చెందుతుందని, కరోనా పెరిగితే నాయకులదే బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
అయితే, కేవలం రాజకీయ పార్టీల సమావేశాల్లో మాత్రమే జనం గుమిగూడుతున్నారా? రాష్ట్రంలోని పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా రద్దీ లేనే లేదా? అనేది సర్కారు ఆలోచించాలని ఆమె హితవు చెప్పారు. గతంలో వైరస్‌ల నివారణకు రోజు లేదా రోజు విడిచి రోజు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేవారని, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వచ్చి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకునేవారని ఆమె చెప్పారు.
ఈ చర్యలు క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నేడు కనీస పర్యవేక్షణ లేని ఈ సర్కారు తీరు చూస్తుంటే అసలు కరోనా వ్యాప్తి నిరోధంపై పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయని ఆమె చెప్పారు.
మూడో వేవ్ ఆందోళనల కారణంగానే కదా హైకోర్టు గురుకులాలు, హాస్టళ్లల్లో ప్రత్యక్ష బోధనకు బ్రేక్ వేసింది? హైకోర్టుకు ఉన్న ఆందోళన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కారుకు ఒక విధానమంటూ లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని విజయశాంతి విమర్శించారు.