అమరీందర్ రాజీనామాకు సిద్దూ వర్గం పట్టు!

వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుమ్ములాటలతో సతమతమవుతోంది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనను రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మందికి పైగా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. 

కెప్టెన్ అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నవజోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఆ పార్టీ అధిష్ఠానం జూలైలో నియమించినప్పటి నుండి పార్టీలో కుమ్ములాటలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి  పదవిపై కన్నేసిన సిద్దూ అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా మొదటిరోజు నుండి పావులు కదుపుతున్నారు. 

మంగళవారం తాను నిర్వహించిన అసమ్మతిదారుల సమావేశానికి 46 మంది ఎమ్యెల్యేలు హాజరైనట్లు ఎమ్యెల్యే  త్రిప్ట్ రాజిందర్ బజ్వా వెల్లడించారు. ఈ సమావేశంలో నలుగురు కెప్టెన్ కేబినెట్‌లో మంత్రులు పాల్గొనడం గమనార్హం. తామంతా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి, ముఖ్యమంత్రిని మార్చమని కోరనున్నట్లు తెలిపారు.

పాకిస్తాన్, కశ్మీర్ అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారులను అమరీందర్ టార్గెట్ చేయడాన్ని వారు ఖండిస్తున్నారు. సీఎం అమరీందర్ రాజీనామాను డిమాండ్ చేస్తున్న వారిలో ఎమ్మెల్యేలు.. త్రిప్ట్ రాజిందర్ బజ్వా, సుఖ్జిందర్ సింగ్ రాంధావా, చరణ్‌జిత్ సింగ్ చన్ని, సుఖ్బిందర్ సింగ్ సర్కారియా‌లతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పర్గట్ సింగ్‌లు ఉన్నట్లు సమాచారం.

వీరంతా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకి అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెస్ అధిష్టానవర్గానికిగల ప్రత్యేక అధికారమని చెప్పారు. అయితే తమకు కెప్టెన్‌పై నమ్మకం పోయిందని స్పష్టం చేశారు.

కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైంని ధ్వజమెత్తారు. పార్టీ కేడర్‌కు తీవ్రమైన అసంతృప్తి ఉందని, ఈ వివరాలను పార్టీ అధిష్ఠానానికి తెలియజేయడం కోసం ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఐదుగురు సభ్యుల బృందానికి బాధ్యతలను అప్పగించారని వెల్లడించారు. 

ముఖ్యమంత్రిని మార్చకపోతే పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మనుగడ ఉండదని రాష్ట్ర మంత్రి బజ్వా తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని వివరించేందుకు సోనియా గాంధీని కలిసేందుకు బయల్దేరుతున్నట్లు తెలిపారు.

చర్యకు బీజేపీ డిమాండ్

పంజాబ్ కాంగ్రెస్ నేతలు కశ్మీరు, పాకిస్థాన్‌లపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారేమో కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం స్పష్టంగా చెప్పాలని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థిస్తున్నట్లు అవుతుందని స్పష్టం చేశారు.
 
ఈ వ్యాఖ్యలు చేసిన నేతలకు పంజాబ్ కాంగ్రెస్ పెద్దలతోపాటు, ఢిల్లీలోని ఆ పార్టీ అధిష్ఠానం మద్దతు ఉందని ఆరోపించారు. వీరి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని చెబుతూ వారు దేశ భద్రతపై తీవ్ర ప్రభావం కలిగించే బాధ్యతారహితమైన ప్రకటనలు  పదే పదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ కొత్తగా నియమించుకున్న సలహాదారులు మల్వీందర్ సింగ్ మాలి, ప్యారేలాల్ గార్గ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలోనూ కలకలం రేగుతున్నది.   జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని, అధికరణ 35ఏను రద్దు చేయడంపై మల్వీందర్ సింగ్ మాలి వ్యాఖ్యలు చేశారు.
 
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాకిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలను గార్గ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను మొదట ఖండించిన కాంగ్రెస్ నేతల్లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నారు. ఈ సలహాదారులను కట్టడి చేయాలని సిద్ధూను ముఖ్యమంత్రి కోరారు. 
 
కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కూడా ఈ సలహాదారుల వ్యాఖ్యలను ఖండించారు.  తనను కలవాలని వీరిద్దరినీ సిద్ధూ ఆదేశించారు. చట్టప్రకారం వారిద్దరిపై కఠిన చర్య తీసుకోవాలని సీఎంకు సన్నిహితులుగా భావించే ఐదుగురు మంత్రులు, ఒక ఎమ్యెల్యే కాంగ్రెస్ అధిష్టానంను డిమాండ్ చేశారు.