టీకా ద్వారానే కరోనా మహమ్మారి నుండి రక్షణ 

టీకా ద్వారానే కరోనా వైరస్ నుంచి ప్రభావవంతమైన రక్షణ లభిస్తుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య  నాయుడు స్పష్టం చేశారు. ఒకవేళ వైరస్ సోకినప్పటికీ తీవ్రత తక్కువగా, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు స్వల్పంగా ఉంటాయని తెలిపారు. 
 
బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ప్లానింగ్ విభాగం మరియు ‘గివ్ ఇండియా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘వాక్సినేట్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మహమ్మారి కారణంగా నెలకొన్న ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని హెచ్చరించారు. అందుకోసం ప్రజలు అలసత్వాన్ని వీడి, చేతులు కడుక్కోవడం, మాస్కు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం వంటి కరోనా జాగ్రత్తలను పాటించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 
 
వీటి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, కళకారులు, సినీ-క్రీడా ప్రముఖులు చొరవ తీసుకోవాలని సూచించారు.క రోనా మహమ్మారిపై పోరాటంలో టీకా నుంచి ప్రభావవంతమైన రక్షణ లభిస్తుందని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారిలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.  
 
ప్రజల్లో టీకా విషయంలో ఎన్నో అపోహలు, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని, దీంతోపాటుగా టీకాకరణకు సంబంధించి చక్కర్లు కొడుతున్న అవాస్తవాలు, అపనమ్మకాలను తొలగించేందుకు మీడియా మరింత చొరవతీసుకోవాలని చెప్పారు. 
ఈ సందర్భంగా కరోనా నుంచి రక్షణ కోసం ఐదు సూత్రాలను ఆయన సూచించారు. 
 
మాస్కు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, శారీరక వ్యాయామం, యోగ లాంటి వాటిని నిత్యం చేయడం, సంప్రదాయవంతమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవడం లాంటి ఐదు సూత్రాల ద్వారా కరోనా నుంచి ఉత్తమ రక్షణ పొందవచ్చని తెలిపారు. దీనితో పాటు కరోనా పై పోరును ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
 పట్టణ ప్రాంతాలనుంచి పల్లెల వరకు భారత వైద్యరంగంలోని మౌలికవసతుల కల్పనలోని అంతరాలను కరోనా మహమ్మారి మరోసారి గుర్తుచేసిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.  ఈ అంతరాలను వీలైనంత త్వరగా తగ్గించేందుకు ప్రత్యేకమైన దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
ఈ విషయంలో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంలో ప్రైవేటు రంగం కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. కర్ణాటక గవర్నర్  థావర్‌చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి  బస్వరాజ్ బొమ్మయ్  కూడా పాల్గొన్నారు.