తాలిబన్లకు రష్యా, చైనాలు వంతపాడటం దౌర్భాగ్యం 

తాలిబన్ సర్కారును పాకిస్తాన్ కీర్తించడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు కానీ కమ్యూనిస్ట్ దేశాలైన రష్యా, చైనాలు వంతపాడటమే దౌర్భాగ్యమని బిజెపి నాయకురాలు విజయశాంతి విస్మయం వ్యక్తం చేశారు. ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల్ని చూస్తే గుండె చెరువైపోతోందని చెబుతూ మహిళలను లైంగిక బానిసలుగా మలచిన ఆ రోజులు మళ్లీ వచ్చాని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

1996 నుంచి 2001 వరకూ అక్కడ చోటుచేసుకున్న పరిణామాల జ్ఞాపకాలు నేటికీ పీడకలలా వెంటాడుతూ స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే మళ్ళీ నరరూప రాక్షసులైన తాలిబన్ల ఆటవికపాలన మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్ని లైంగిక బానిసలుగా చేసి, పిల్లల్ని కనే యంత్రంలా మార్చేసి, విద్య-ఉద్యోగాలకు దూరం చేసిన దుర్మార్గపు రోజులు మళ్ళీ వచ్చేశాయని పేర్కొన్నారు.

నిబంధనలు పాటించని వారిని రాళ్లతో కొట్టి చంపడం, చిన్న తప్పులకే బహిరంగంగా కాళ్ళు, చేతులు నరకడం, మత గ్రంథం లోని నిబంధనలు అనుసరించకపోతే తల నరికేయడం, చెట్టుకు వేలాడదీసి ఉరివేయడం, బతికుండగానే తగులబెట్టడం లాంటి దారుణమైన మధ్యయుగపు మూర్ఖపు శిక్షలు వారికి నిత్యకృత్యం మరిచిపోలేమని ఆమె తెలిపారు.

బురఖా ధరించని ఒక నడివయసు మహిళను తలపై కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని గుర్తు చేస్తూ  ఇంతటి నీచ నికృష్టమైన తాలిబన్ సర్కారును పాకిస్తాన్ గుర్తించి ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదని ఆమె చెప్పారు. ఈ పరిణామాలపై మన దేశంలోని కమ్యూనిస్ట్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించనే లేదని ఆమె గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే తాలిబన్లతో చర్చలకు అవకాశముండాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి సలహా ఇచ్చి తన సంస్కారాన్ని చాటుకున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. తాలిబన్ల కంటే పలు రెట్లు అధికంగా ప్రభుత్వ సైన్యం ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు తోకముడిచాయి. ఇది పూర్తిగా దేశభక్తి, జాతీయవాద చైతన్యం లేని ఆ దేశ ప్రజల ఘోర వైఫల్యం తప్ప మరొకటి కాదని ఆమె స్పష్టం చేశారు.

తాలిబన్లు కేవలం ఆప్ఘనిస్థాన్‌తో ఆగిపోరని, చైనా-పాక్ తోడ్పాటుతో దీర్ఘ కాలంలో వారి లక్ష్యం భారత్ అని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులను బట్టి తెలుస్తోందని ఆమె గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారతీయుల ఐక్యతే శ్రీరామరక్ష అని ఆమె తెలిపారు.