సర్దార్ పాపన్న స్పూర్తితో నయా రజాకార్ల పాలన అంతం 

మొగలాయి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని 30 ఏళ్ల పాటు పాలించిన పోరాట యోధుడు మన సర్వాయి పాపన్న స్పూర్తితో దొరల గడీలు బద్దలు కొట్టి,  నయా రజాకార్ల పాలనను అంతం చేద్దామని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపిచ్చారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు మన సర్దార్ సర్వాయి పాపన్న అని తెలిపారు. 

సర్వాయి పాపన్న బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్బాంధవుడు. సమసమాజ స్థాపన సాధన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వీరుడు. ఔరంగజేబుకే ముచ్చెమటలు పట్టించి గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరేసిన కొదమ సింహం. మొగలాయి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని 30 ఏళ్ల పాటు పాలించిన పోరాట యోధుడు మన సర్వాయి పాపన్న అంటూ సంజయ్ కొనియాడారు. 

‘‘అమ్మా! తాటిచెట్టు ఎక్కను. లొట్టి పట్టను. గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగరేయడమే నా జీవిత ఆశయం’’ అని తల్లికి మాటిచ్చి అనుకున్నది సాధించిన మహా వీరుడు అని చెప్పారు. అతి సామాన్య కల్లుగీత కుటుంబం పాపన్నదని పేర్కొన్నారు. కానీ ఆనాటి మొఘల్ చక్రవర్తుల నిరంకుశ పాలనను, స్థానిక జమిందారులు, జాగీర్ దారులు, దేశ్ ముఖ్ లు, భూస్వాముల దోపిడిని, దౌర్జన్యాలకు విసిగిపోయి ఎదిరించడానికి అతను చేసిన సాహసం ఎనలేనిదని తెలిపారు.

ఒక్కనితో ప్రారంభమైన సర్దార్ పాపన్న పోరాటం సబ్బండ కులాల పీడిత ప్రజలను సమీకరించుకొని 12 వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, గెరిల్లా పోరాటాలు చేస్తూ తన స్వస్థలం ఖిలాషాపూర్‌ రాజధానిగా పాలన సాగించాడు. భువనగిరి కోటను వశం చేసుకొని సుమారు రెండు దశాబ్దాలు, గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని 30 ఏళ్లపాటు జనరంజక పాలన చేసిన మహనీయుడని సంజయ్ వివరించారు. 

ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులే. పాపన్న కంటే శివాజీ 20 సంవత్సరాలు ముందు జన్మించారు. ఇద్దరూ మొఘల్ చక్రవర్తులను ఎదిరించి రాజ్యాలను స్వాధీనం చేసుకున్న వాళ్లే. కానీ ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కలేదు. కనీస చారిత్రక ఆనవాళ్లు కూడా లేకుండా పాలకులు చేశారని విచారం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం సర్దార్ సర్వాయి పాపన్నజయంతి ఉత్సవాలను నిర్వహించకపోవడం బాధాకరం అని చెప్పారు. మజ్లీస్ నేతలకు భయపడే పాపన్న చరిత్రను కనుమరుగు చేసే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని వింటిసంచారు. ఆత్మ గౌరవం కంటే కేసీఆర్ ఇచ్చే తాయిలాలు తెలంగాణ ప్రజలకు ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలని చెబుతూ పాపన్న చరిత్ర ను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.