విజయ్ మాల్యా ఆస్తులను జప్తుకు మార్గం సుగమం 

భారతదేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసుకోవడానికి బ్యాంకులకు మార్గం సుగమమైంది. మాల్యా దివాలా తీసినట్లు యుకె కోర్టు  ప్రకటించిన నేపధ్యంలో… భారత బ్యాంకులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను జప్తు చేసుకునేందుకు మార్గం సుగమమైనట్లు వినవస్తోంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్యర్యంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియం మాల్యాపై బ్రిటీష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్(ఐసీసీ) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ హైకోర్టులోని చాన్సరీ విభాగంలో వర్చువల్ విచారణ నిర్వహించారు.

‘డాక్టర్ మాల్యా దివాలా తీర్పుని ప్రకటిస్తున్నాను’ అని చెప్పారు. కాగా… లండన్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే అవకాశం మాల్యాకు లేదు. విచారణ సందర్భంగా న్యాయ సంస్థ టీఎల్‌టీ ఎల్‌ఎల్‌పీ న్యాయవాది మార్సియా షెకర్‌డామియన్ భారత బ్యాంకుల తరఫున హాజరయ్యారు.

మాల్యా తనను అప్పగించడానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు పూర్తయ్యే వరకు యూకేలో బెయిల్‌పై ఉంటాడు. విచారణ సందర్భంగా, మాల్యా న్యాయవాది ఫిలిప్ మార్షల్ భారత కోర్టుల్లో  చట్టపరమైన సవాళ్లు కొనసాగే వరకు ఈ ఉత్తర్వును నిలిపివేయాలని కోరారు. అయితే, ఆయన న్యాయవాదుల డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. మాల్యా మొత్తం డబ్బును సరైన సమయంలో బ్యాంకులకు తిరిగి ఇస్తారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు.

దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా న్యాయవాదులు కోర్టుకు ఓ దరఖాస్తును సమర్పించారు, దీనిని న్యాయమూర్తి బ్రిగ్స్ తిరస్కరించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా  మాల్యాకు చెందిన విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ 2012 అక్టోబరు 20 నుండి మార్చి 2016 వరకు భారతదేశం నుండి ఒక్క విమానం కూడా  బయటకు వెళ్ళలేదు. 

రుణాలు చెల్లించకపోవడం, బ్యాంకులను మోసం చేయడమన్న ఆరోపణల నేపధ్యంలో విజయ్ మాల్యాను 2019 జనవరిలో ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు’గా ప్రకటించిన విషయం తెలిసిందే. మాల్యా 2 మార్చి 2016 న భారతదేశం విడిచి లండన్ వెళ్ళిపోయారు.