భారత్ అంచనా వృద్ధి రేటును తగ్గించిన ఐఎంఎఫ్

భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం ప్రభావం తీవ్రంగా పడిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ అంచనా వృద్ధి రేటును 300 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వృద్ధి రేటులో మూడు శాతం కోత విధించింది. 
 
ఏప్రిల్‌లో నిర్వహించిన సమీక్షలో 12.5 శాతం వృద్ధిని అంచనా వేయగా, తాజాగా నిర్వహించిన సమీక్షలో ఈ రేటును 9.5 శాతానికి తగ్గించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఈ ఏడాది మార్చి-మే మధ్య కాలంలో కోవిడ్ మహమ్మారి ప్రభావం పడిందని పేర్కొంది. 

ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మార్చి-మే మధ్య కాలంలో కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారత దేశంలో వృద్ధి అవకాశాలపై అంచనాలను తగ్గించినట్లు తెలిపింది. ఈ ఎదురు దెబ్బ నుంచి చాలా నెమ్మదిగా కోలుకునే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపింది. 

కరోనా వైరస్ రెండో ప్రభంజనంలో భారత దేశం తీవ్రంగా ప్రభావితమైంది. ఆరోగ్య సంరక్షణ రంగంపై ఒత్తిడి ఎక్కువైంది. అత్యవసర మందులు, ఆక్సిజన్ వంటివాటిని డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. భారత దేశంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు విస్తరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

 ఇక 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రంలో అంత‌ర్జాతీయ‌ వృద్ధి రేటు ఆరు శాతంగా ఉంటుంద‌ని ఐఎంఎఫ్ త‌న అంచ‌నాల‌ను కొన‌సాగించింది. అయితే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఆశించిన దానికంటే మంద‌కొడిగా సాగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.