అశోక గజపతిరాజు లక్ష్యంగా సింహాచలం భూముల వివాదం 

మాన్సస్‌ ట్రస్టు ఛైర్మన్‌ పదవి నుంచి ఇటీవల తాము నియమించిన సంచయితా గజపతిరాజును తొలగించి, హై కోర్ట్ ఉత్తరువులతో తిరిగి మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక గజపతిరాజు పున: నియామకం కావడాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సహింపలేక పోతున్నట్లున్నది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్న వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చాలా అసహనంగా కనిపిస్తున్నారు. 

అందుచేత ఏదోవిధంగా అశోక గజపతిరాజును దోషిగా నిలబెట్టు, ఆ ట్రస్ట్ పై తిరిగి తమ ఆధిపత్యం చెల్లించడం కోసం మొత్తం ప్రభుత్వ రెవిన్యూ యంత్రాంగాన్ని పురమాయించినట్లు కనిపిస్తున్నది.   సింహాచలం దేవస్థానం భూముల్లో గతంలో జరిగిన అక్రమాలను, అశోక గజపతిరాజు ట్రస్టు ఛైర్మన్‌గా గతంలో చేసిన పనులను వెలికితీసే పనిని తాజాగా ముమ్మరం చేస్తున్నారు. 

మాన్సాస్‌ ట్రస్టుకు సంబంధించి సుమారు 748 ఎకరాల భూమిని నిబంధనలు పాటించకుండా కబ్జా చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.  విజయనగరం జేసి కిశోర్‌బాబు, విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి   నేరుగా సర్వే చేసేలాగ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29న ఆదేశించింది. 

వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు, ఈ భూ అవకతవకలకు పాల్పడిన పెద్దల పాత్రను బహిర్గతం చేస్తామంటూ విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రకటించారు.   విజయనగరం జిల్లా కొత్తవలస, విశాఖలోని భీమునిపట్నం ప్రాంతంలో ఈ అన్యాక్రంతం అయిన భూముల్లో ప్రాథమికంగా 36 ఎకరాలు గుర్తించినట్లు చెబుతున్నారు.

ఈ మొత్తం 748 ఎకరాలపై కోర్టుకు సమర్పించిన ఆధారాలన్నిటితో పాటు అశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన మరిన్ని అక్రమాలు బయటకొస్తాయంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. పంచ గ్రామాల భూ సమస్యకు సైతం సులభంగా పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.

సింహాచలం పంచ గ్రామాలకు చెందిన భూ సమస్యపై వివాదం కోర్టులో పెండింగులో ఉందని, ఈ కేసును అడ్వకేట్‌ జనరల్‌ (ఎజి) హైకోర్టు ధర్మాసనానికి నివేదించినట్లు విజయసాయిరెడ్డి తాజాగా స్పష్టం చేశారు. అంతేగాక సింహాచలం దేవస్థాన భూముల్లో నివాసాలుంటున్న సుమారు 12 వేల మందికి రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని కూడా వెల్లడించారు.

అయితే అంతా సక్రమంగానే ట్రస్టు నడిచిందంటూ తాజాగా అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.  1997లో సింహాచలం దేవస్థానం భూములకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పట్టాల జారీలో జరిగిన అక్రమాలపైనా తాజాగా ప్రభుత్వం కోర్టులో కేసు వేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలూ బయటకొస్తే టిడిపికి చెందిన పలువురి నేతలపై చర్యలుంటాయంటూ వైసిపి నేతలు చెబుతున్నారు.