తెలంగాణ పోలీసుల వలయంలో నాగార్జునసాగర్

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు నాగార్జునసాగర్ వరకు పాకింది. ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్ డ్యామ్‌పై భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు.

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులతో పాటు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సాగర్‌ ప్రధాన డ్యాం, జల విద్యుత్‌ కేంద్రాల వద్ద 338 మంది పోలీసు సిబ్బంది మోహరించగా, పులిచింతల ప్రాజెక్టు వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. 

షిఫ్టులవారీగా 90మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. ప్రాజెక్టులకు వెళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసు భద్రత నడుమ ఈ కేంద్రాల్లో జెన్‌కో అధికారులు విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రంగనాథ్ సమీక్షించారు.

కృష్ణ జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యాంపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ సందర్భంగా రాష్ట్ర రైతు అవసరాల దృష్టా సంపూర్ణ సామర్థం మేరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కోను ఆదేశించింది. దాదాపు 2,500 మెగావాట్ల విద్యుత్‌ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదులు కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతను వివరిస్తూ సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎస్‌పి భాస్కరన్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. టిఎస్ జెన్‌కో వద్ద భారీగా బందోబస్తు నిర్వహించారు. ప్రాజెక్ట్ సమీపంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 

పులిచింతల ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను టిఎస్ జెన్‌కో ప్రారంభించింది. మొదటి యూనిట్ ద్వారా 16.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుండి 1500 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేయనున్నారు.