ఆరు నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళన పట్ల తమ ప్రభుత్వం చాలా ఓపికగా ఉన్నదని, కానీ ఏదైనా హింసాత్మక చర్యలకు పాలపడితే కఠిన చర్యలు తప్పవని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ హెచ్చరించారు.
నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు కొత్త కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో మొండిగా ఉండకూడదని హితవు చెప్పారు.
ప్రభుత్వంతో చర్చలకు ముందస్తు షరతుగా మార్చడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను “కొద్దిమంది” మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, “సాధారణ రైతులు సంతోషంగా ఉన్నారు” అని కూడా ఆయన పేర్కొన్నారు. “ఆందోళనకు నాయకత్వం వహించే వారు వాస్తవానికి రైతులు కాదు. వ్యవసాయ చట్టాలపై నిజమైన రైతులకు అభ్యంతరం లేదు, వారు సంతోషంగా ఉన్నారు, ”అని తెలిపారు.
“వారు మా సొంత ప్రజలు. మేము ఓపికపడుతున్నాము, వారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ మేము సహిస్తాము. కానీ పరిమితిని దాటడం ఎవరి ప్రయోజనానికి కాదు. ఒకసారి వారు పరిమితిని దాటినప్పుడు, వారు ఆందోళనను శాంతియుతంగా కొనసాగిస్తారని, హింసకు పాల్పడరని వ్రాతపూర్వకంగా ఇవ్వమని వారికి చెప్పాం. హింసాత్మక కార్యకలాపాలు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటారు” అని ఖట్టార్ తేల్చి చెప్పారు.
“లైంగిక వేధింపులు, హత్యలు జరిగాయి, రహదారులను మూసివేయడం, గురించి స్థానిక ప్రజలతో కూడా వివాదాలకు కూడా దిగుతున్నారు. దీని కోసం పంచాయతీలు కూడా జరిగాయి” అని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
బహదూర్గర్ లో నలుగురు వ్యక్తులు నిప్పంటించడంతో 42 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఈ నలుగురు ఢిల్లీ సమీపంలోని తిక్రీ సరిహద్దు వద్ద కొనసాగుతున్న రైతుల ఆందోళనలో భాగంగా ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
కాగా, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే వారు రాజకీయ కారణాల వల్ల మాత్రమే చేస్తున్నారని ఖట్టార్ స్పష్టం చేశారు. “వారి పంజాబ్ బృందం అలా చేస్తోంది ఎందుకంటే అక్కడ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. రాజకీయ కోణం ఉపయోగించి ప్రభుత్వాన్ని పరువు తీయడం ఇక్కడ ఎజెండా. దీనికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది, ”అని ఆరోపించారు.
“రైతుల పట్ల సమాజంలో గౌరవ భావం ఉంది, కాని తమను తాము రైతులుగా పిలుచుకుని, ఆందోళన చేస్తున్న కొద్దిమంది ప్రజలు నిజమైన రైతులను పరువు తీస్తున్నారు. రాజకీయంగా ప్రేరేపించబడిన ఈ రైతుల కారణంగా, రైతుల ఆందోళన పేరిట రోడ్లను స్తంభింప చేయడంతో సమీప గ్రామాలు, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల వ్యాపారాలు నిలిచిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.
“సమీప పంచాయతీల ప్రజలు అక్కడ నిరసన తెలిపే వారితో సానుకూల చర్చలు జరపడానికి నిరసన స్థలాలను సందర్శిస్తున్నారు. వారు అడ్డుకున్న రహదారులను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు, తద్వారా నిరసనకారులు చేసిన దిగ్బంధనాల కారణంగా ప్రస్తుతం పనిచేయని వారి వ్యాపారాలను తిరిగి ప్రారంభించవచ్చు” అని ముఖ్యమంత్రి సూచించారు.
ఇలా ఉండగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. ఢిల్లీ నుంచి వస్తున్న కొత్తగా నియమితులైన బీజేపీ కార్యదర్శి అమిత్ వాల్మీకి స్వాగతం పలికేందుకు ఢిల్లీ-ఘాజియాబాద్ ఎక్స్ప్రెస్వేను అనుసంధానించే హిండన్ ఎలివేటెడ్ రహదారి ప్రారంభం వద్దకు సుమారు 400 మంది బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు.
మరోవైపున ఉన్న రైతులు వందల సంఖ్యలో తమవైపునకు వచ్చి దాడి చేశారని ఘజియాబాద్ బీజేపీ యూనిట్ నగర అధ్యక్షుడు సంజీవ్ శర్మ ఆరోపించారు. పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని, పలు వాహనాలు ధ్వంసమయ్యాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు