మమత ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు మండిపాటు

పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింస చెలరేగినప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపైనా, ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడంలో విఫలమవడంపైనా మండిపడింది. 

ఈ హింసాకాండపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కోరింది.  ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని కలకత్తా హైకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

రాష్ట్ర ప్రజలు ఆస్తి న‌ష్టం, ప్రాణ నష్టం ముప్పును ఎదుర్కొంటుండటాన్ని తీవ్రంగా పరిగణించాలంది. బెంగాల్‌ను తనకు నచ్చిన దారిలో వెళ్లడానికి అనుమతించరాదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిప‌డింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్య‌త ప్రభుత్వానికి ఉందని గుర్తుచేసింది.. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించాలని తెలిపింది.

ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే కమిటీకి అవసరమైన సదుపాయాలు కల్పించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీకి ఏమైనా అడ్డంకులు సృష్టిస్తే కోర్టు ధిక్కారం క్రింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరోవంక, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై బాధితుల తరపున సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌  వ్యవహరంలో నిన్న(శుక్రవారం) ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. పిటిషన్‌లో వాదనలు వినాల్సిన జడ్జి తనంతట తానుగా తప్పుకున్నట్లు ప్రకటించారు. 

‘‘ఈ కేసును విచారణ చేపట్టేందుకు నేను సిద్ధంగా లేదు. వ్యక్తిగతంగా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అందుకే తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆమె బెంగాల్‌కు చెందిన వ్యక్తే.  ఇక ఈమె తప్పుకోవడంతో ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది.

ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింస దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ బాధితుల కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఇవి రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేసిన పిటిషన్‌గా పేర్కొంటూ కొట్టివేయాలని సుప్రీంను కోరుతోంది. అంతేకాదు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.  

అయితే ఈ అభ్యర్థనపై సరైన వివరణ ఇవ్వాలని సుప్రీం బెంగాల్‌ సర్కార్‌ను ఆదేశించింది. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ప్రతీ ఘటనను ఎన్నికల హింసకు ఆపాదించడం సరికాదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వి​జ్ఞప్తి చేస్తోంది. ఇంకోవైపు,  గ్యాంగ్‌ రేప్‌నకు గురైన ఓ దళిత బాలిక, వృద్ధురాలి తరపున ఘటనలపై సిట్‌ లేదా సీబీఐ విచారణ జరిపించాలనే పిటిషన్‌ దాఖలు అయ్యాయి.