జీ7 సదస్సుకు ప్రధానిని ఆహ్వానించిన బ్రిటన్ ప్రధాని

రేపు ప్రారంభంకానున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్ననున్నారు. ఈ నెల 12, 13న జరగనున్న ఈ సమావేశాలకు వర్చువల్ విధానంలో ప్రధాని హాజరుకానున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారల శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి వెల్లడించారు.

కరోనా కారణంగా ప్రధాని నేరుగా జీ7 సమావేశాలకు హాజరు కాలేకపోతున్న విషయం తెలిసిందేనని, అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమావేశాల్లో వర్చువల్ విధానంలో పాల్గొనబోతున్నారని బాగ్చి తెలిపారు.  12న ప్రారంభం కానున్న జీ7 సమావేశాలకు బ్రిటన్ అధ్యక్షత వహించనుంది. ఈ క్రమంలోనే సమావేశాలకు హాజరు కావల్సిందిగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సౌత్ కొరియాలను బ్రిటన్ ఆహ్వానించింది.

కాగా.. ఈ ఏడాది జీ7 సమ్మిట్‌లో ‘బిల్డ్ బ్యాక్ బెటర్ (తిరిగి గొప్పగా నిర్మించుకుందాం)’ ప్రధాన నినాదంగా తీసుకున్నారు. అలాగే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన బ్రిటన్  నాలుగు ప్రధాన లక్ష్యాలను ప్రకటించింది.

కరోనా నుంచి ప్రపంచం మొత్తం బయటపడడడమే కాకుండా  భవిష్యత్తులో దాడి చేయబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండడం అందులో మొదటిదేతే,  భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం రెండోది. అలాగే వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోంటూ భూమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడడం మూడోది కాగా. భాగస్వామ్య విలువలను రక్షించుకుంటూ స్వేచ్ఛాయుత సమాజాన్ని నెలకొల్పడం నాలుగో నినాదంగా బ్రిటన్ పేర్కొంది.

అలాగే ఈ సమావేశంలో పాల్గొనే దేశాలన్నీ ప్రపంచంలో నెలకొన్న కరోనా సమస్యపై, వాతావరణ మార్పులపై చర్చించి తమ ఆలోచనలను పంచుకోనున్నాయి. ఇక 2019లో జరిగిన జీ7 సమావేశాలకు కూడా అప్పటి అధ్యక్ష దేశం ఫ్రాన్స్  భారత్‌ను ఆహ్వానించింది. ఆ సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ  వాతావరణ మార్పులు, సముద్రాల్లోని జీవవైవిధ్యం, సాంకేతిక పరివర్తన వంటి అంశాలపై మాట్లాడారు.