తొలి మాస్క్ ర‌హిత దేశంగా ఇజ్రాయెల్

క‌రోనా వైర‌స్‌పై ఇజ్రాయెల్ దేశ‌వాసులు స‌మ‌ష్టి విజ‌యం సాధించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 20 న ప్రారంభించిన టీకా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసి ఈ నెల 15 నుంచి మాస్క్‌ల‌ను ధ‌రించే నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేయ‌నున్నారు. దాంతో తొలి మాస్క్ ర‌హిత దేశంగా ఇజ్రాయెల్ నిలువ‌నున్న‌ది.

ఈ విష‌యాన్ని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి యులి ఎడెల్స్‌టెయిన్ ప్రకటించారు. ఈ నెల ఒక‌టే తేదీ నుంచే గుంపులుగా ఉండ‌టం, ప‌రస్ప‌ర దూరం పాటించాల‌నే నిబంధ‌న‌ల‌ను ఎత్తివేశారు. అయితే, పొరుగు దేశాల్లో క‌రోనా వ్యాక్సిన్ కార్య‌క్ర‌మాలు ఇంకా కొన‌సాగుతుండ‌టంతో విదేశీ ప్రయాణంపై ఆంక్షలు ఇంకా ఎత్తివేయలేదు.

తొమ్మిది దేశాలకు ప్రయాణించడంపై ఇప్పటికీ నిషేధం కొన‌సాగుతున్న‌ది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు నిర్బంధ నియమం అమ‌లులో ఉన్న‌ది. వారికి కరోనా పరీక్షలు కూడా నిర్వ‌హించ‌నున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లో 12 నుంచి 15 ఏండ్ల చిన్నారులకు కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు.

2020 డిసెంబర్ 20 న ప్రారంభమైన టీకా కార్య‌క్ర‌మం యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌డుతున్నారు. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలు, 65 ఏండ్ల వ‌య‌సు పైబడిన వారికి టీకాలు వేయించారు. అనంత‌రం టీకా కోసం వయస్సు ప‌రిమితిని తగ్గించారు. దాంతో దాదాపు అంద‌రికీ టీకాలు వేయ‌డం పూర్త‌వుతున్న‌ద‌ని అక్క‌డి అధికారులు చెప్తున్నారు. రానున్న ప‌ది రోజుల్లో 100 శాతం టీకాలు పూర్తిచేయాల‌న్న టార్గెట్‌తో ప‌నిచేస్తున్నారు.