సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై కేంద్ర హోమ్ శాఖ వేటు తప్పదా!

సిఐడి అదనపు డిజి సునీల్‍ కుమార్‍ తనను అక్రమంగా అరెస్ట్ చేసి, నిర్బంధంలో చిత్రహింసలకు గురిచేశారని  ఒక వంక కు ఎంపీ రఘురాంకృష్ణం రాజు చేసిన ఫిర్యాదులు, మరోవంక అతను క్రైస్తవ మతం స్వీకరించినా దళితుడిగా ఐపీఎస్ లో కొనసాగుతున్నారని వచ్చిన ఫిర్యాదుల ఫలితంగా కేంద్ర హోమ్ శాఖ తీవ్రమైన చర్యలు తీసుకొనక తప్పదని తెలుస్తున్నది. 

సునీల్‍ కుమార్‍ దళిత, మాల రిజర్వేషన్‍తో ఐపిఎస్‍కు ఎంపికయ్యారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించటంతో ఆయన రిజర్వేషన్‍ను రద్దు చేయాలని పలువురు డిమాండ్‍ చేస్తున్నారు. సునీల్‍ కుమార్‍ ఎంపికకు ముందే క్రైస్తవ మతాన్ని స్వీకరించినా,  ఐపిఎస్‍కు ఎంపిక అయ్యాక క్రైస్తవ మతాన్ని స్వీకరించినా.. దళిత, మాల రిజర్వేషన్‍తో ఐపిఎస్‍కు ఎంపిక అయిన విధానం చెల్లదని  సీనియర్‍ న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.

ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయకుండానే ఎంపీ రఘురాజును అరెస్టు చేసి ఆయనపై థర్డ్ గ్రేడ్‍ డిగ్రీ ప్రయోగానికి ముఖ్య కారకులు అని బయట పడటంతో ఏదో ఒక రోజు ఆయనకు షాక్‍ ఎదురవటం ఖాయమని ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా లీగల్‍ రైట్స్ అడ్వయిజరీ కన్వీనర్‍ సునీల్ కుమార్ జోషి సునీల్‍ కుమార్‍పై సంచలన ఫిర్యాదు కేంద్రానికి చేశారు.

దళిత, మాల పేరుతో ఐపిఎస్‍కు రిజర్వేషన్‍ ద్వారా ఎంపిక అయిన సునీల్‍ కుమార్‍ క్రైస్తవ మతస్ధుడిగా మారారని, ఆయనను వెంటనే తప్పించాలని జోషి కేంద్రాన్ని కోరారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాల్సిందే అని మద్రాసు హైకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడం గమనార్హం. 

ఆ తీర్పుప్రకారం సునీల్‍ను తొలగించాలని.. జోషి డిమాండ్‍ చేశారు. అంతే కాకుండా నిబందనలకు విరుద్దంగా అంబేద్కర్‍ ఇండియా మిషన్‍  పేరుతో సునీల్‍ కుమార్‍ ప్రారంభించిన సంస్థపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలని కేంద్రాన్ని జోషి కోరారు.

అంబేద్కర్‍ మిషన్‍ పేరుతో హిందూ మత వ్యతిరేక భావాలను సునీల్‍ కుమార్‍ ప్రోత్సహించారని,సెక్షన్‍ 153 (ఎ), 295 (ఎ) కింద ఎఫ్‍ఐఆర్‍ నమోదు చేసి పూర్తి స్థాయిలో హోంశాఖ దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని జోషి డిమాండ్‍ చేశారు.

ఇంకోవైపు, రఘురామరాజు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఆయనపై ఇప్పటికే కోర్ట్ ధిక్కరణ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ పరిస్థితులలో ఆయనపై తగు చర్య తీసుకోవాలని కేంద్ర హోంశాఖపై నానాటికి  వత్తిడి పెరుగుతున్నది.