బిజెపి అధిష్టానంపై తనపై విశ్వాసం ఉన్నంతవరకు తాను పదవిలో కొనసాగుతానని కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ ఎడ్డియూరప్ప స్పష్టం చేశారు. “ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంపై నాపై విశ్వాసం ఉన్నంతవరకు నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. వారు నేను కొనసాగనవసరం లేదని చెప్పిన రోజున నేనే రాజీనామా చేస్తాను. రాష్ట్రాభివృద్ధి కోసం రేయంబవళ్ళు పనిచేస్తుంటాను” అని ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు.
ఇటీవల కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సి.పి. యోగిశ్వర, హుబ్బల్లి-ధార్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లా ఢిల్లీలో బిజెపి సీనియర్ నాయకులను కలిశారు. యెడియరప్పను వ్యతిరేకిస్తున్న శాసనసభ్యుల ఫిర్యాదులను వారు తెలియచేశారనే ఊహాగానాలకు దారితీసింది.
వెంటనే, యెడియరప్ప కుమారుడు, బిజెపి ఉపాధ్యక్షుడు బి.వై. విజయేంద్ర కూడా ఢిల్లీ వెళ్లి బిజెపి ధ్యక్షుడు జె.పి.నాడ్డాకు అసమ్మతివాదుల కార్యకలాపాల గురించి ఫిర్యాదు చేశారు.
యెడియరప్ప విలేకరులతో మాట్లాడుతూ, “నేను ఎటువంటి గందరగోళంలో లేను. వారు (అధిష్ఠానం) నాకు ఒక అవకాశం ఇచ్చారు. మంచి కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను. మిగిలింది అంతా వారే చూసుకుంటారు” అని పేర్కొన్నారు.
కాగా, ఈ విషయమై తాను “ఎవరినీ విమర్శించను” అని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తన పదవిని చేపట్టడానికి “రాష్ట్రం, దేశంలో ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ వ్యక్తులు ఉంటారని” ఆయన తెలిపారు.
ఆదివారం యెడియరప్ప వ్యాఖ్యల అనంతరం, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సి.ఎన్. అశ్వత్నారాయణ్ ముఖ్యమంత్రిగా యడ్డియూరప్ప వైదొలగే అవకాశాన్ని తోసిపుచ్చారు. “ఆయన [యెడియరప్ప] పదవి నుంచి తప్పుకునే ప్రశ్న లేదు. అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదు. తాను పార్టీ క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఉన్నందున పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండటానికి తాను సిద్ధంగా ఉన్నానని మాత్రమే ఆయన ఒక ప్రకటన చేశారు” అని అశ్వత్నారాయణ వివరణ ఇచ్చారు.
ఎడియురప్పకు 78 సంవత్సరాలు వయస్సు పూర్తయిన తర్వాత బీజేపీలో 75 ఏళ్ళు దాటినా వారు కీలక పదవులలో కొనసాగరాదనే ఒక అనధికార నిబంధనను కొంతకాలంగా పాటిస్తూ ఉండడంతో ఆయన పదవిలో కొనసాగడంపై ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడుతున్నది.
అయితే ఆయన ప్రస్తుతం తన పదవీకాలం పూర్తిగా కొనసాగుతారని బిజెపి ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ సహితం ఈ మధ్య స్పష్టం చేయడం గమనార్హం. ఏదేమైనా, కర్ణాటకలో బిజెపి నాయకుడిగా యడియురప్పకు విశేష ప్రజాదరణ అనడం, రాష్ట్రంలో ప్రాబల్యం గల లింగాయత్ సమాజంతో ఆయనకున్న పట్టు కారణంగా పార్టీ అధిష్ఠానం ఆయనను మార్చే ఆలోచన చేయడం లేదని తెలుస్తున్నది.

More Stories
త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు..ఉదయనిధి అరెస్ట్, హైకోర్టులో బెయిల్
‘జెన్ జెడ్’, ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులతో 6న డా. భగవత్ భేటీ
కర్ణాటక కాంగ్రెస్లో క్యాబినెట్ విస్తరణ కలకలం