కరోనా మూడో దశ చిన్న పిల్లలకు ఎక్కువ హానికి ఆధారాలేవు 

కరోనా మూడో దశ చిన్న పిల్లలకు ఎక్కువ హాని కలిగిస్తుందనే దానికి ఎటువంటి ఆధారాలు లేవని ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా స్పష్టం చేశారు.  చిన్న పిల్లల్లో కరోనా ప్రభావం తీవ్రంగా లేనప్పటికీ.. వీరికి పలువిధాలుగా నష్టం జరిగింది. సమాజానికి చిన్నారులే వెన్నెముక కావున, వారికి అండగా ఉండేందుకు సమాజమంతా కలిసిరావాల్సి అవసరం ఉందని ఆయన చెప్పారు. 

కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రస్తుతం సమాజంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. ఒకరికొకరు సాయం చేసుకునేందుకు మనం ముందుకు రావాలని గులేరియా పిలుపునిచ్చారు. బ్లాక్‌ ఫంగస్‌ అనేది సంక్రమణ వ్యాధి కాదని గులేరియా ఈ సందర్బంగా స్పష్టం చేశారు. కోవిడ్‌-19 ప్రారంభ దశలో రోగులు ఈ బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతుండడాన్ని మనం చూస్తున్నాం, ఇది ఒక సవాల్‌గా ఉందని పేర్కొన్నారు. 

ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్న రోగుల్లో, స్టెరాయిడ్లు తీసుకున్న రోగుల్లో తలనొప్పి, ముక్కు రక్తస్రావం, ముఖంలో వాపు(కళ్లు) వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమౌతున్న నేపథ్యంలో పరీక్షలు, చికిత్స సదుపాయాలు పెంచాల్సిన అవసరాన్ని చెబుతున్నాయని తెలిపారు.

కాగా, భారత్‌లో 18-44 ఏళ్ల మధ్య ఉన్న వారికి కోటికి పైగా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దేశంలో ప్రజలకు వేసిన మొత్తం వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 19.6 కోట్లకు చేరిందని వెల్లడించింది. 28,16,725 సెషన్ల ద్వారా మొత్తం 19,60,51,962 డోసులు ఇచ్చామని పేర్కొంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించారు. జూన్‌ 1 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని బీహార్‌ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కొత్త కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు సిఎం నితీష్‌కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీ, హర్యానాల్లో ఈ నెలాఖరు వరకు, రాజస్థాన్‌లలో జూన్‌ 8 వరకు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. మరోవైపు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేశారు. కడలూర్‌ జిల్లా పోలీసులు సరిహద్దులో 1500 మంది సిబ్బందిని మోహరించారు. వైద్య అత్యవసరాలకు తప్ప మిగిలిన కారణాలకు రాష్ట్రంలోని అనుమతించేది లేదని ఎస్‌పి అభినవ్‌ పేర్కొన్నారు.