నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించిన కాశ్మీర్ పోలీస్ 

జమ్మూ, కాశ్మీర్ పోలీసులు సోమవారం పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. ఓ ఉగ్రవాదిని అరెస్టు చేయడమే కాక, కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
8 కిలోల హెరాయిన్ తీసుకెళ్తున్న ఈ గ్రూప్‌ గురించి జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది.  ఈ క్రమంలో కాపుగాసి మాటేసిన పోలీసులు ఈ గ్రూప్‌కు చెందిన ఒక వ్య‍క్తిని పట్టుకున్నారు. ఇతడిని మదాసిర్ అహ్మద్‌గా గుర్తించారు.
“ఈ గ్రూప్‌, పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ గ్రూపు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ లోయలో యాక్టీవ్‌గా ఉన్న ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ రికవరీలు మాదకద్రవ్యాల డీలర్లకు, ఉగ్రవాదులకు మధ్య పరస్పరం ఉన్న సంబంధాన్ని కూడా బహిర్గతం చేశాయి” అని కశ్మీర్‌ ఐజీ విజయ్ కుమార్‌ తెలిపారు.
ఈ గ్రూపు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలపు బలోపేతం చేయడానికి పని చేస్తోంది. అంతేకాక స్థానిక యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోంది అన్నారు ఐజీ విజయ్‌ కుమార్‌. ఇక పట్టుబడిన ఈ 8 కిలోగ్రామలు హెరాయిన్‌ మార్కెట్‌ విలువ 50 కోట్ల రూపాయల ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ మాదక ద్రవ్యాల రవాణాలో తో పాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నాడని, కాని అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవంక, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో భారీగా హెరాయిన్‌ను బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 65 కోట్ల విలువైన 12.9 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. హెరాయిన్‌ను త‌ర‌లిస్తున్న ఒక‌రిని బీఎస్ఎఫ్, నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.