సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకే కేంద్రం మొగ్గు

కరోనా వ్యాప్తి నేపధ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే అంశపై మల్లగుల్లాలకు తెరపడింది. మెజారిటీ వర్గాల నిర్ణయం మేరకు సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకే కేంద్రం మొగ్గు చూపుతోంది. జులైలో జేఈఈ, నీట్ పరీక్షలు జరిపే అవకాశం ఉంది. 

పరీక్షలపై ఏం చేద్దాం అని నిర్ణయించేందుకు ఆదివారం అన్నిరాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులు, బోర్డు చైర్మన్ల తో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో కేంద్ర మంత్రులు రమేష్ పొక్రియాల్, స్మృతి  ఇరానీ, ప్రకాష్ జవదేకర్ కూడా పాలుపంచుకున్నారు.

అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన డిమాండ్ వేరకు జేఈఈ, నీట్ పరీక్షలు జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి తగ్గాక జులై లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై జూన్ 1 న విధివిధానాలు, పరీక్షల షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు  కేంద్ర విద్య శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ వెల్లడించారు. 

కేంద్రం ఇచ్చిన అప్షన్లపై ఈనెల 25 లోపు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కేంద్రం సూచించింది. 12వ తరగతి పరీక్షలపై రాష్ట్రాలతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రమేష్ పొక్రియాల్ తెలిపారు. ఈనెల 25లోగా సమగ్ర సూచనలు పంపాల్సిందిగా రాష్ట్రాలను కోరామని రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు.

విద్యార్థులు, టీచర్ల క్షేమం, భద్రత, భవిష్యత్తు మాకు చాలా ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. “పరీక్షల నిర్వహణపై మేము తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందనే నమ్మకం ఉంది” అని రమేశ్ పోఖ్రియాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

షార్ట్‌ ఫామ్‌లో పరీక్షలు నిర్వహించడంతో పాటు, పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వదిలేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. సిబిఎస్‌ఇ చేసిన రెండు ఆప్షన్లలో  మొదటిది; మూడు నెలల్లోగా పరీక్షలు నిర్వహించడం.. అంటే ఒక నెలలో ప్రీ-ఎగ్జామ్స్‌ కార్యకలాపాలు, రెండు నెలల్లో పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడించడం. 

మరో 30 రోజుల్లో కంపార్ట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించడం. అది కూడా కేవలం మేజర్‌ సబ్జెక్టులకు మాత్రమే నిర్వహించిన మైనర్‌ సబ్జెక్టులకు, మేజర్‌ సబ్జెక్టులకు వచ్చిన ఫలితాలను బట్టి మార్కులివ్వడం. 

ఇక రెండవది: 19 మేజర్‌ సబ్జెక్టులకు 90 నిమిషాల పాటు పరీక్షలు నిర్వహించడం. విద్యార్థులు ఒక లాంగ్వేజ్‌, మూడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టులకు పరీక్షలు రాయడం. ఈ సబ్జెక్టులల్లో వచ్చిన మార్కులను బట్టి 5,6 సబ్జెక్టులకు మార్కులివ్వడం. ఈ రెండు ప్రతిపాదనలు సిబిఎస్‌ఇ చేసింది.