ఐటి రిటర్న్‌ల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

ఆదాయం పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును మరో నాలుగు నెలలు ప్రభుత్వం పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందుల దృష్టా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 

కంపెనీలకు కూడా రిటర్నుల దాఖలుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొవిడ్ వైరస్ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిడిటి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) పేర్కొంది. 

వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్ 31గా సిబిడిటి గడువు ఇచ్చింది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం -16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది. ఐటి రిటర్న్‌ల దాఖలును సులభం చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

జూన్ 7న కొత్త ఇ-ఫైలింగ్ వెబ్ పోర్టల్

వచ్చే నెల 7న పన్ను చెల్లింపుదారులకు కొత్త ఆదాయ పన్ను ఇ ఫైలింగ్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించేందుకు ఐటి శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిని ఐటిఆర్ ఫైలింగ్, ఇతర పన్ను సంబంధిత పనులకు ఉపయోగించవచ్చు. కొత్త పోర్టల్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వెబ్ పోర్టల్ జూన్ 1 నుండి జూన్ 6 వరకు మూసివేస్తారు. 

పాత పోర్టల్ నుండి కొత్త పోర్టల్‌కు వెళ్ళే పనులు పూర్తవుతాయని, జూన్ 7 నాటికి ఇది అమలులో ఉంటుందని డిపార్ట్‌మెంట్ సిస్టమ్ వింగ్ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.inను తీసుకొచ్చింది. జూన్ 7 నుంచి ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఫిర్యాదు పరిష్కారానికి జూన్ 10 తర్వాత తేదీని నిర్ణయించాలని ఈ ఉత్తర్వు అధికారులను సూచించింది.

రూ.24,792 కోట్ల రిఫండ్స్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే 17 వరకు 15 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ .24,792 కోట్ల టాక్స్ రిఫండ్స్ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ మొత్తంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్స్ మొత్తం రూ.7,458 కోట్లు, కంపెనీ పన్ను కింద రూ .17,334 కోట్లు రిఫండ్స్ చేశారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 17 వరకు 15 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు సిబిడిటి రూ.24,792 కోట్ల రిఫండ్స్ చేసిందని ఐటి శాఖ తెలిపింది.