అక్టోబరు నాటికి మన వ్యాక్సిన్లు ప్రపంచంలోనే అగ్రస్థానం

వచ్చే అక్టోబరు నాటికి దేశీయ వ్యాక్సిన్లు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి  తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోని తొలి ఆరు దేశాల్లో భారతీయ వ్యాక్సిన్లు మూడో స్థానం లో ఉన్నాయని చెప్పారు. దేశంలో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని కొనియాడారు. 
 
 ఢిల్లీలోని తన నివాసం నుంచి తెలుగు మీడియా ప్రతినిధులతో వెబినార్‌ నిర్వహిస్తూ మానవాళికి సవాలుగా మారిన కరోనా కట్టడికి ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతంగా పోరాడుతున్నాయని పేర్కొన్నారు. 

 దేశంలో మరికొన్ని కంపెనీలు టీకాలపై పరిశోధనలు జరుపుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నా రు. రష్యాకు చెందిన స్పుత్నిక్‌ టీకాను దేశంలో సరఫరా చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. వచ్చే జూలై నాటికి 39.9 కోట్ల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. 

మేలో 10 కోట్లు, జూన్‌లో 11 కోట్లు, జూలైలో 14.8 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు  చెప్పారు. వీటికి అదనంగా వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నుంచి మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఆగస్టులో 30-35 కోట్లు, సెప్టెంబరులో 45-50 కోట్లు, అక్టోబరులో 46-51 కోట్లు, నవంబరులో 53.5-58.5 కోట్లు, డిసెంబరులో 55.5-60.5 కోట్ల వంతున మొత్తం 255 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. 

ఇవికాకుండా మరో ఐదు కంపెనీల వ్యాక్సిన్లు పరిశోధనలో ఉన్నట్లు  చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన బయోలాజిక్‌ ఈవెంట్స్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మధ్య ఒప్పందాలు చేసుకుని, టెక్నాలజీ బదిలీ పూర్తయితే నెలకు 5 కోట్ల టీకాలు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ఏ వ్యాక్సిన్‌ అయినా మన దేశంలో ఉత్పత్తికి దరఖాస్తు చేసిన రెండు రోజులు లేదా 24 గంటల్లోపే అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు చెప్పా రు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ కంపెనీల వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం సంప్రదింపులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 18 కోట్ల మందికి పైగా ఉచితంగా టీకాలు వేసినట్లు తెలిపారు.