రఘురామ అరెస్టుపై బండి సంజయ్‌ మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ రఘురామ కృష్టంరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  విమర్శించారు. ఒక ఎంపీని ఈడ్చుకెళ్తారా..? బలవంతంగా కారులోకి తోస్తారా..? అంటూ నిప్పులు చెరిగారు. 

‘‘లోక్‌సభ స్పీకర్‌ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడిని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అనుమతించింది? రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగుతోందా లేక మీ మిత్రుడైన ఏపీ సీఎం కోసం నియంతృత్వ పాలన సాగిస్తున్నారా?” అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. 

మఫ్టీలో వచ్చిన వారిని చూస్తే పోలీసులో లేక కిడ్నాపర్లో అర్థం కాలేదని ధ్వజమెత్తారు. రఘరామను అరెస్టు చేశారో లేక అపహరించారో ఆయన కుటుంబ సభ్యులకు అర్థం కాలేదంటే పరిస్థితి ఎంత దారుణమో తెలుస్తోందని చెప్పారు. రఘురామకు 4 నెలల కిందట గుండెకు శస్త్రచికిత్స అయింది. ఒక హృద్రోగితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? అని నిలదీశారు. 

ప్రాణాలను అరచేత పట్టుకుని హైదరాబాద్‌కు వస్తున్న ప్రజలను సరిహద్దుల్లో ఆపేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఎంపీని అరెస్టు చేయించేందుకు పోలీసులను ఎలా రానిచ్చింది?  అని ప్రశ్నించారు. లాక్‌ డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కి, పదుల సంఖ్యలో ఏపీ సీఐడీ పోలీసుల్ని ఇంత అత్యవసరంగా రాష్ట్రంలోకి ఎందుకు అనుమతించారు? అని విస్మయం వ్యక్తం చేశారు. 

 రఘురామ కృష్ణంరాజేమైనా దేశం వదిలి పారిపోతున్నారా? ఎంపీకి ఎన్నో రకాల ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఈ విషయం ఏపీ, తెలంగాణ పోలీసులకు తెలియదా? అని బండి సంజయ్‌ మండిపడ్డారు.