అంబులెన్సులను అడ్డగించే తెలంగాణ సర్క్యులర్‌పై స్టే

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లపై కట్టడి విధిస్తు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినా… సర్క్యులర్ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

 
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. సర్క్యులర్‌లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది. వైద్య సహాయం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషంట్లు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. 
అంబులెన్స్‌లో వస్తున్న  పేషంట్ ప్రవేశాన్ని కంట్రోల్ రూం ఆపలేదని  హై కోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొంది. అంబులెన్స్‌లు ఆపొద్దని తెలంగాణ పోలీస్‌శాఖకు హైకోర్టు ఆదేశించింది. 
 
పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయింది. ఏపీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఎంట్రీని నిలువరిస్తే ఆర్టికల్‌ 14 ఉల్లంఘనేనని ఏపీ ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది.
 
ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్ మార్గం నేషనల్‌ హైవే.. దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్‌కు హక్కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు ఏజీ విన్నవించారు. ప్రతి పేషేంట్‌కు ఆస్పత్రి అడ్మిషన్‌ ఉండాలని ఏజీ అన్నారు.  రాష్ట్ర ప్రజల బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నన్నారు. 
 
తెలంగాణ అధికారులు కరోనాపై రివ్యూ చేసి.. ఇతర రాష్ట్రాలకు ఈ సర్క్యులర్ జారీ చేశారని ధర్మాసనానికి తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా ఇలాంటి నిబంధన ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణ చాలా మేలు చేస్తుందని, ఇతర రాష్ట్రాల్లో నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే అసలు ఎంట్రీ లేదని కోర్టుకు తెలిపారు. ఆస్పత్రి అనుమతి ఉంటేనే అనుమతి ఇస్తున్నామని చెప్పారు.