తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి 

ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది. కూరగాయలు, తృణధాన్యాలు, ఇతర ఆహా ర పదార్థాల ధరలు చౌకగా మారడంతో ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ 4.29 శాతానికి చేరుకుంది.

మార్చిలో ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి 5.52 శాతంగా ఉంది. నివేదిక ప్రకారం, ఏప్రిల్‌లో కూరగాయల ధరలు 14.18 శాతం తగ్గాయి. ధాన్యం ధరలు 2.96శాతం, చక్కెర 5.99 శాతం తగ్గాయి. అదే సమయంలో కరోనా కారణంగా నాన్-వెజ్ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో మాంసం, చేపలు, గుడ్డుతో సహా ఆయిల్, నెయ్యి ధరలు 26 శాతం పెరిగాయి.

అంతే కాకుండా పండ్ల ధరలు కూడా 9.81 శాతం పెరిగాయి. కేంద్ర గణాంకాల శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణ రేటు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) లక్షం 4 శాతం (+/ 2%) లోపు ఉంది. ద్రవ్యోల్బణ రేటు వరుసగా ఐదోసారి ఆర్‌బిఐ పరిధిలో ఉంది. దీనికి ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.02 శాతానికి తగ్గింది. మార్చిలో ఇది 4.87 శాతంగా ఉంది.

ఏప్రిల్ 5న ఆర్‌బిఐ ఎంపిసి సమావేశం జరగ్గా, ఈ భేటీలో సభ్యులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో ద్రవ్యోల్బణాన్ని అంచ నా వేశారు. ద్రవ్యోల్బణ రేటు 5.2 శాతంగా ఉంటుందని అంచనాల్లో తెలిపారు. ఆర్‌బిఐ రెపో రేటును 4 శాతం వద్ద కొనసాగిస్తోంది. గవర్నర్ శక్తికాంత దాస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 10.5 శాతం నమోదవుతుందని అంచనా వేశారు.

కాగా, మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 22.4 శాతంతో పెరిగింది. బుధవారం ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, మార్చి నెలలో ఐఐపి 22.4 శాతానికి పెరగ్గా, ఫిబ్రవరిలో ఇది మైనస్ 3.6 శాతానికి పడిపోయింది. జనవరి నెలలోనూ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతలోనే ఉంది.