వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి భార‌త్ బ‌యోటెక్‌తో పీఎస్‌యూల ఒప్పందం 

భారత్ బయోటెక్‌తో రెండు పీఎస్‌యూలు  కొవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు పీఎస్‌యూల రాక‌తో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్స‌త్తి మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఈ రెండింటిలో ఒక‌టి ఇండియ‌న్ ఇమ్యునోలాజిక‌ల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌) కాగా, రెండోది భార‌త్ ఇమ్యునోలాజిక‌ల్స్ అండ్ బ‌యోలాజిక‌ల్స్ కార్పొరేష‌న్ (బీఐబీసీఓఎల్‌).

భారతదేశంలో వ్యాక్సిన్లను ఉత్ప‌త్తి చేస్తున్న‌ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తో క‌లిసి ఈరెండు పీఎస్‌యూలు కొవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

టీకా డ్రైవ్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండ‌టంతో స్థానికంగా అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్‌తో టెక్నాలజీ బదిలీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ రెండు పీఎస్‌యులు వ‌చ్చే సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తున్నాయి.

ముంబైకి చెందిన హాఫ్కిన్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్‌ టెస్టింగ్ కూడా కోవాగ్జిన్ మోతాదుల‌ ఉత్పత్తిని వ‌చ్చే నవంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్న‌ది. వ్యాక్సిన్ తయారీకి ఇతర సంస్థలతో టెక్నాలజీ బదిలీ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారత్ బయోటెక్ సుముఖంగా ఉన్న‌దని నీతి ఆయోగ్ ప్రకటించడంతో ఈ ఒప్పందాలు జ‌రిగిన‌ట్లుగా తెలుస్తున్న‌ది.