ప్రైవేటు ఉద్యోగాల్లోనూ స్థానికులకు 40 శాతం

ఇక నుంచి ప్రైవేటు ఉద్యోగాల్లోనూ స్థానికులకు 40 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ఉత్తర ప్రదేశ్ లోని  గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ తెలిపింది. ప్రభుత్వ ప్రకటనపై నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

జాట్, గుర్జర్ సామాజిక వర్గానికి ప్రైవేటు ఉద్యోగాలు లభించడం లేదని రైతు నేత రాకేశ్ తికాయత్ ఇటీవల ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఢిల్లీ-నోయిడా సరిహద్దును దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అంతలోనే యూపీ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

ఇటీవల హర్యానా, ఝార్ఖండ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రకటనే చేశాయి. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించాయి. తాజాగా యూపీ ప్రభుత్వం చేసిన ప్రకటనకు స్థానిక చట్టసభ్యులు మద్దతు పలికారు.

ఇది దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ అని, స్థానిక యువతకు వారి అర్హతను బట్టి ఇప్పుడు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని జెవార్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు.

అయితే, కార్పొరేట్ మల్టీ నేషనల్ కంపెనీల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటు రంగంలో ప్రభుత్వ ఉద్యోగుల అనవసర జోక్యం పెరిగిపోతుందని గ్లోబల్ అసోసియేషన్ ఫర్ కార్పొరేట్ సర్వీసెస్ (జీఏసీఎస్) వ్యవస్థాపక సభ్యుడు సమీర్ సక్సేనా పేర్కొన్నారు.