టీఆర్ఎస్ అండతోనే బైంసాలో హిందువులపై మజ్లిస్  దాడులు

నిర్మల్ జిల్లా బైంసాలో టీఆర్ఎస్ అండతో మజ్లీస్ పార్టీ నాయకత్వంలో హిందువులపై టీఆర్ఎస్ అండతోనే మజ్లిస్ నాయకుల దాడుల దాడులు పథకం ప్రకారం జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 3 నెలల క్రితం అకారణంగా మత కలహాలు, ఆస్తులు ధ్వంసం చేయగా, మళ్లీ గత వారం మత కలహాలు చెలరేగాయని ఆయన గుర్తు చేశారు. 

టీఆర్ఎస్ సహాయంతో మజ్లీస్ పార్టీ భయానక పరిస్థితులు సృష్టిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అండతో కలహాలకు కారకులైన మజ్లీస్ నేతలను వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడుల్లో హిందువులు నష్ట పోతున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పోలీసుల చేతికి సంకెళ్లు వేసినట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

మతకలహాల వీడియోలు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగితే మజ్లీస్ పార్టీకి భయపడి పోలీసులు కేసులు పెట్టలేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు మజ్లీస్ పార్టీకి అండగా ఉండి పోలీసులను అడ్డుకుంటున్నారని చెబుతూ మజ్లీస్ పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లోనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు.

బాధితులకు నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు..  కేసీఆర్ కుటుంబం.. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇతర రాష్ట్రాల అంశాలను లేవనెత్తుతూ ఓట్లు పొందాలని చూస్తోందని విమర్శించారు.  బైంసా లో ఘటనలు, ఫిర్యాదులపై పూర్తి నివేదిక అందించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

కేసీఆర్ కుటుంబం.. ఒవైసి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం, ఎన్నికల పొత్తుల కారణంగా పదే పదే ఘటనలు జరుగుతున్నాయి.. కేసీఆర్ మమత బెనర్జీని ఆదర్శంగా తీసుకుని పశ్చిమ బెంగాల్ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రం ఉంది.. పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశీలకు అనుగుణంగా టీఎంసీ వ్యవహరిస్తోంటే… మజ్లీస్ కు అనుగుణంగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. 

తెలంగాణ మేధావులు ప్రజలు రాష్ట్ర పరిస్థితులను అర్ధం చేసుకోవాలని కోరారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ కేంద్రంపై, ప్రధాని మోదీపై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కుమారుడు తెలంగాణను శాసిస్తున్నాడు .. అన్ని మంత్రిత్వ శాఖలపై పెత్తనం చేలాయిస్తున్నాడు. కానీ, బైంసాలో దాడులు జరిగితే కేటీఆర్ మాట్లాడలేదని విస్మయం వ్యక్తం చేశారు. 

ఇచ్చిన హామీలు మరిచిపోయి కేంద్రం పై విమర్శలు చేస్తూ ఉంటే చేతులు ముడుచుకుని కూర్చోమని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇంకా ఆట మొదలు కాలేదు.. బిజెపి ఆట మొదలు పెడితే టీఆర్ఎస్ దిమ్మ తిరుగుతుందని కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.