మమతా దీదీ… మీ ఇష్టానుసారం మీరు ఆడారు… 

`మమతా దీదీ… మీ ఇష్టానుసారం మీరు ఆట (ఖేలా) ఆడారు’ అంటూ బెంగాల్ లో ఇక ఆమె `ఆట’ ముగిసిపోయిన్నట్లే అనే సందేశాన్ని కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ ఇచ్చారు. ప్రధాని మోదీ మాత్రమే బెంగాల్‌లో నిజమైన మార్పు తీసుకురాగలరని ఆమె స్పష్టం చేయారు. 
 
నందిగ్రామ్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారంనాడు నామినేషన్ వేసిన మాజీ మంత్రి సువేందు అధికారి తరఫున హల్దియాలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొంటూ మమతా బెనర్జీ పాలనపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ బిడ్డనే బెంగాల్ కోరుకుంటోందంటూ టీఎంసీ నినాదాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై దీదీని (మమత) అడగడానికే తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు.
 ‘ఏ అడబిడ్డకు ఓటు వేయాలి. 80 ఏళ్ల వృద్ధురాలిని కొట్టిందెవరు? బీజేపీ కార్యకర్తలను హత్య చేయించిందెవరు? దుర్గా నిమజ్జనానికి, సరస్వతి పూజకు అనుమతి ఇవ్వని దెవరు?’ అని మమతను స్మృతి ఇరానీ నిలదీశారు. కేంద్ర ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్‌ను ప్రజలకు అందనీయకుండా మమతా బెనర్జీ చేసారని విమర్శించారు.
భవనీపూర్ నుంచి కాకుండా నందిగ్రామ్‌లో పోటీ చేయాలని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయంపై కూడా కేంద్ర మంత్రి ప్రశ్నలు గుప్పించారు. ‘మీ ఆట పూర్తయినందునే భవానీపూర్ వదిలిపెట్టారా? లేదా నందిగ్రామ్‌లో ఆట మొదలుపట్టాలనుకుంటున్నారా?’ అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
పీఎం కిసాన్ యోజన సహా అనేక కేంద్ర పథకాలు పేదలకు అందకుండా మమత చేశారని ఆమె ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రజల సంక్షేమం కోసం అహోరాత్రులు కష్టపడుతుంటే, దీదీ మాత్రం పలు కేంద్ర పథకాలను తమవిగా  చెప్పుకుంటూ ఫోటోలు దిగడంలో బిజీగా గడుపుతూ వచ్చారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు నిజమైన మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పును ఒక్క మోదీనే తీసుకురాగలరని ఆమె స్పష్టం చేశారు.