జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త రెడ్డి సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు. 
 
మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌య‌ల‌క్ష్మి, శ్రీల‌త రెడ్డికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నెల 11వ తేదీన మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త‌ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.
 
 మేయ‌ర్   విజ‌య‌ల‌క్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్‌ ఉల్‌ లూమ్‌ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు.
2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా మొదటిసారి విజయం సాధించారు.  కొంతకాలంపాటు టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.