సజ్జలను తొలగించండి…. ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించండి 

సుప్రీం కోర్ట్ మొట్టికాయలు వేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. దానితో ఎన్నికల కమీషన్ తో ఘర్షణలు తప్పడం లేదు.
 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు పాటించని,  కమీషన్ కు దురుద్దేశ్యాలు అంటగడుతున్న వారిపట్ల రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కఠినంగా వ్యవహరిస్తున్నారు.  ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు న్నికల కమిషనర్ రమేష్ కుమార్  లేఖ రాశారు. రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతే కాకుండా తనపై సజ్జల చేసిన విమర్శలను గవర్నర్‍ దృష్టికి నిమ్మగడ్డ తీసుకెళ్లారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా లక్ష్మణ రేఖ దాటారని వారిపై త్వరలో కోర్టుకు వెళ్లనున్నానని.. ఈ విషయాన్ని ముందుగానే మీ దృష్టికి తీసుకు వస్తున్నానని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు.

అదే విధంగా, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా జిఎడి పొలిటికల్‍ శాఖాదిపతిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఎస్‍ అధికారి ప్రవీణ్‍ ప్రకాష్‍ను ఎన్నికల విధుల నుండి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్‍దాస్‍కు లేఖ వ్రాసారు. 

ప్రవీణ్‍ ప్రకాష్‍ ఎన్నికల విధులలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రవీణ్‍ ప్రకాష్‍ సమీక్షలు జరపకుండా ఆదిత్యనాద్‍ దాస్‍ ఆదేశాలు ఇవ్వాలని ఆ లేఖలో నిమ్మగడ్డ కోరారు. జనవరి 23వ తేదీన కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరగకపోవటానికి జిఎడి శాఖాదిపతి ప్రవీణ్‍ ప్రకాషే కారణమని.. తన ఆదేశాలను పట్టించుకోలేదని.. ఆదిత్యనాద్‍ దాస్‍కు రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు.

సంబందిత అధికారులను సన్నద్దం చేయటంలో ప్రవీణ్‍ ప్రకాష్‍ విఫలమయ్యారని దాని వలన ఎన్నికల షెడ్యూల్‍ వాయిదా వేయాల్సి వచ్చిందని.. అంతే కాకుండా జనవరి 20వ తేదీన నామినేషన్ల స్వీకరణకు ప్రవీణ్‍ ప్రకాష్‍ సహకరించటం లేదని ఆ లేఖలో నిమ్మగడ్డ చెప్పారు. 

ఇలా ఉండగా, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ప్రభుత్వం పై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదంటూ  హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ను దాఖలు చేశారు. పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అప్పటి సీఎస్‌ నీలం సాహ్నిల పేర్లను తన పిటిషన్‌ లో ప్రధానంగా పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌ కు సంబంధించి ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ను ప్రతివాదిగా చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదనలు వినిన తరువాత తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.