ఫిట్మెంట్ తగ్గించాలని చూస్తే తడాఖా చూపిస్తాం!

ఫిట్​మెంట్​ను 43 శాతానికి పైనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్​ చేశాయి. తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని, తడాఖా చూపిస్తామని హెచ్చరించాయి. పీఆర్సీ రిపోర్టు చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాదని మండిపడ్డాయి. 

ఈ రిపోర్టుతో సీఎం నిజస్వరూపం తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్​కుమార్​ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ రెండో రోజు గురువారం పీఆర్సీపై ఎనిమిది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. మరిన్ని యూనియన్లతో శుక్ర, శనివారం కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. 

ఈ సందర్భంగా  యూనియన్ల నేతలు మీడియాతో మాట్లాడుతూ 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలంటూ కమిషన్​ చేసిన  సిఫార్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సిఫార్సులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. హెచ్​ఆర్​ఏను పెంచాల్సింది పోయి తగ్గించాలంటూ సిఫార్సు చేయడం ఏమిటని, తగ్గిస్తే సహించబోమని హెచ్చరించారు. 

రిటైర్డ్​ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచాలని, సీపీఎస్​ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్​ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్​ చేశారు. మంచి ఫిట్​మెంట్​ను సీఎం కేసీఆర్​ ప్రకటించాలని, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కమిటీని కోరినట్లు వివరించారు.