బెంగాల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేట్లు చూస్తాం

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ఎంత సవాల్‌గా తీసుకుంటున్నాయో, కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతే సవాల్‌గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం భేటీ అయ్యారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విషయంపై వారితో చర్చించారు. 
 
వీరితో పాటు బెంగాల్ డీజీపీ, సీఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీతో సమావేశమయ్యారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ‘‘అన్ని రాజకీయ పక్షాలతో కూలంకషంగా చర్చించాం. మరో దఫా ఈ చర్చలుంటాయి. నిన్న రాత్రి 10:30 గంటల వరకూ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఐజీలతో సమావేశమయ్యాం.’’ అని అరోరా పేర్కొన్నారు.
 
 స్వేచ్ఛగా, పారదర్శకంగా, నైతికంగా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సదా సిద్ధంగానే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం శాంతిభద్రతల విషయంలో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయని, అంతేకాకుండా ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయని వారు తమ దృష్టికి తీసుకొచ్చారని అరోరా పేర్కొన్నారు.
 
వీటితో పాటు పోలింగ్ స్టేషన్లలో వీడియోలు పెట్టాలని, జాతీయ భద్రతా బలగాలను మోహరించాలని కొన్ని పార్టీలు తమను కోరినట్లు అరోరా తెలిపారు. తమిళనాడు, బెంగాల్, అసోం షెడ్యూల్‌ను ప్రకటించగానే రాష్ట్రానికి ప్రత్యేక పరిశీలకులను పంపుతామని ఆయన ప్రకటించారు. కోవిడ్ దృష్ట్యా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచామని, గతంలో 78,903 పోలింగ్ స్టేషన్లుండగా, ఈ ఎన్నికలకు 1,01,790 మేర పెంచినట్లు సునీల్ అరోరా తెలిపారు.