మమతకు మరో కీలక మంత్రి గుడ్‌బై    

పశ్చిమ బెంగాల్‌లో వరుస పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నాయి. తాజా కేబినెట్‌ మంత్రి రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు రాజీవ్‌ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. 

త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో వరుసగా కీలక​ నేతలు పార్టీని వీడటం, అదీ బీజేపీ కండువా కప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతకు  ఎదురుదెబ్బగా భావించాలి. దోంజూర్‌కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ మంత్రి అయిన రాజీవ్ బెనర్జీ చాలా కాలంగా అసమ్మతిని వ్యక్తం చేస్తున్న ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన కూడా బీజేపీలో చేరతారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి బెంగాల్ పర్యటనకు ముందు రాజీవ్‌ రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార తృణమూల్‌లో అసంతృప్తి నేతలంతా పార్టీని వీడుతున్నారు. డిసెంబర్‌లో సీనియర్‌ నేత సువేందు అధికారితో మొదలైన ఈ రాజీనామాల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.  ఇప్పటికే  టీఎంసీ ఎంపీ సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయన నేతృత్వంలో మరో ఏడుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్‌ అయిన సంగతి తెలిసిందే. అలాగే శాంతిపూర్‌కు చెందిన  ఎమ్మెల్యే అరిందాం భట్టాచార్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.