విషమించిన శశికళ ఆరోగ్యం

 తమిళనాడు మాజీ  ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ ఆరోగ్యం విషమించింది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. 
 
అక్రమాస్తుల కేసుకు సంబంధించి పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఆమె శిక్ష పూర్తి చేసుకొని ఈ నెల 27న విడుదల కావలసి  ఉండగా ఆసుపత్రిలో చేరారు
జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన శశికళ.. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూలో చేరారు. దాంతో ఆమె ఆరోగ్యపరిస్థితి ఎలా వుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదలై చెన్నై రావాల్సిన శశికళ  ఈలోపే అస్వస్థతకు గురవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరప్పన అగ్రహారం జైలులో వుంటున్న శశికళ గత వారం రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఎప్పుడూ లేనంతగా నలతగా కనిపించారు. దీంతో జైలు వైద్యులే ఆమెకు వైద్యం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో జైలు ప్రాంగణంలోనే వున్న ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను బెంగుళూరు శివాజీ నగర్‌లో వున్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అంబులెన్సు నుంచి వీల్‌చైర్‌పైనే శశికళ ఆస్పత్రిలోకి వెళ్లారు. తొలిగా ఆమెకు కరోనా వైద్య పరీక్షలతో పాటు బీపీ, మధుమేహం, ఆక్సిజన్‌ లెవల్స్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం నియంత్రణలోనే వున్నప్పటికీ ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా వున్నట్టు తేలడంతో సాధారణ వార్డుకు తరలించి, ఆక్సిజన్‌ అందించారు. కానీ జ్వరం పెరుగుతూనే వచ్చింది. ఇదిలా వుండగా గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో మళ్లీ శశికళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపించడంతో వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించారు. అక్కడ ఆర్‌టీపీసీఆర్‌ సహా వివిధ పరీక్షలు నిర్వహించారు.