కాళేశ్వ‌రం పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి కేసీఆర్ మోసం  

కాళేశ్వ‌రం పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.  ‘కేసీఆర్ ఒక విఫల  ముఖ్య‌మంత్రి. అవినీతి ముఖ్య‌మంత్రి.కాళేశ్వ‌రం ప్రాజెక్టు డిజైన్ ఫెయిల్ అయ్యింది’  అంటూ ధ్వజమెత్తారు. 

కేసీఆర్ కార్య‌క్రమాలతో ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌లేరని, కేసీఆర్ పత‌నం ప్రారంభ‌మైందని స్పష్టం చేశారు. గ‌త రెండేళ్ళుగా ఒక్క ఎక‌రానికి కూడా ఈ ప్రాజెక్టు కింద నీరు ఇవ్వ‌లేదని దుయ్యబట్టారు. ఎత్తిపోత‌ల విష‌యంలో గ‌త ఏడాది కూడా డ్రామాలాడారని మండిపడ్డారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు టూరిజం స్పాట్‌గా మారుతుందేమో కాని .. రైతులకు ఏ మాత్రం ఉప‌యోగప‌డ‌దని ఎద్దేవా చేశారు.  

 ‘కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్‌లో కేవ‌లం 17.20 ల‌క్ష‌ల ఎక‌రాలు అని మాత్ర‌మే ఇచ్చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో కోటి ఎక‌రాల‌కు నీరిస్తా అని తెలంగాణ ప్ర‌జ‌ల‌ను వంచించారు. ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇప్పుడు 3వ టీఎంసీ అంట. కొత్త ముచ్చ‌ట చెబుతున్నారు’  అంటూ విమర్శించారు. 

కాళేశ్వ‌రం డీపీఆర్ కేంద్రానికి ఇస్తే కేసీఆర్ బండారం బ‌యట‌ ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. డీపీఆర్‌లను కేంద్రం ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వ‌రంపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు మేం సిద్ధం అని సవాల్ చేశారు.

 కాళేశ్వ‌రం ప్రాజెక్టులో పూజ‌లు చేస్తే పాపాలు పోవని హితవు చెప్పారు. ప్ర‌జ‌లెవ్వ‌రూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌ర్య‌ట‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఆయ‌క‌ట్టు వ‌ర్షం వ‌ల్ల వ‌చ్చిందే.. కాళేశ్వ‌రం వ‌ల్ల కాదని సంజయ్ స్పష్టం చేసారు.