కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌

హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావు, అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్‌ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు.  దీంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆమెకు సహకరించిన టిడిపి నేత  ఏవీ సుబ్బారెడ్డిని కూడా హైదరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు.

అంతకుముందు అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అఖిల ప్రియ వైద్య పరీక్షల రిపోర్టులో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినందునే అస్వస్థకు గురైనట్టు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఆమెను జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు.కాగా, బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ ఏ2 గా ఉండగా ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ఏ3గా, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1 ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. భార్గవ్‌రామ్‌ పరారీలో ఉన్నాడు.

ఇదిలాఉండగా బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అఖిలప్రియ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కిడ్నాప్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. హఫీజ్ పేటలో ఏడాదిగా కొనసాగుతున్న భూవివాదం కారణంగానే సికింద్రాబాద్, బోయిన్ పల్లిలో కిడ్నాప్ జరిగిందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్  అంజనీకుమార్ తెలిపారు.   మొత్తం 15 బృందాలు రంగంలోకి దిగాయని చెబుతూ  తప్పు ఏ స్థాయి వ్యక్తులు చేసినా వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

పోలీస్ కమీషనర్ కధనం ప్రకారం నగరంలోని హఫీజ్‌పేట్‌లో 25 ఎకరాల భూమిని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి ప్రవీణ్‌ కొనుగోలు చేశారు. ఈ భూమి విషయంలో సమస్యలు రావడంతో భూమా నాగిరెడ్డికి దగ్గరగా ఉండే ఏవీ సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వం వహించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఒప్పం దం మేరకు నడుచుకోకపోవడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆ స్థలం విషయంలో ఆ యన కుమార్తె అఖిలప్రియ జోక్యం చేసుకొని తన వాటా ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారమంతా సుబ్బారెడ్డి నిర్వహించారని, దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా అతడిని సంప్రదించాలని  ప్రవీణ్‌ సూచించారు.

అనంతరం అఖిలప్రియ.. ప్రవీణ్‌ను బెదిరించడం, అప్పట్లో జరిగిన పరిణామాలతో తమ పొలంలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రవీణ్‌ గత ఏడాది ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదులో ఏవీ సుబ్బారెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో ఈ విషయంపై వివాదం కొనసాగుతున్నది.