అజయ్ కల్లాంకు మరోసారి జగన్ ప్రభుత్వంలో భంగపాటు!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేవలం 30 రోజుల పాటే ఉంచడం, ముందుగా ఆ పదవిలో నియమించక  పోవడం, తన ఉద్యోగ విరమణ సమయంలో ఆరు  నెలల వరకు పొడిగించే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకొనక పోవడంతో  ఆగ్రహంతో అజయ్ కళ్ళం తర్వాత  ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వచ్చారు. 

వైసిపి ఎన్నికల ప్రణాళిక రచనలో కీలక పాత్ర వహించడమే కాకుండా చంద్రబాబు పాలనను తూర్పురా పడుతూ ఒక గ్రంధం కూడా వ్రాసారు. మేధావిగా రాష్ట్రం అంతా పర్యటనలు జరిపి చంద్రబాబు పాలనపై  పరోక్షంగా యుద్ధం కూడా చేశారు. అందుకు కృతజ్ఞతగా అన్నట్లు అధికారంలోకి రాగానే అజయ్ కల్లమ్ ను ప్రధాన సలహాదారుడిగా జగన్ నియమించుకొని, ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా మొత్తం పాలనా యంత్రంగంపై కీలక బాధ్యతలు అప్పజెప్పారు. 
 
పరిపాలనలో కీలక నిర్ణయాలు, నీయమకాలు అన్నింటిలో ఆయన కీలక అధికార కేంద్రంగా మారారు. తర్వాత ఏమిజరిగిందే ఏమిటో తర్వాత ఆయన వద్ద ఉన్న అధికారాలు అన్నింటిని తొలగించి, సీఎంఓ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు వాటిలో అత్యధికం అప్పచెప్పారు. ఒక విధంగా ఉత్సవ విగ్రహంగా మార్చారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు పరిపాలన విభాగాలు అప్పగించరాదనే సాకుతో ఆ విధంగా చేశారు.
అయితే తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్న నీలం సాహ్నిని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించారు. ఇప్పటికే అజయ్ కల్లాం ఆ పోస్టులో ఉన్నారు. అంటే ఒక్క ముఖ్యమంత్రికి ఇద్దరు ముఖ్య సలహాదారులు అన్న మాట. ఈ మేరకు జీవో కూడా ఇఛ్చారు.
అందులోనే నీలం సాహ్నికి ఆరోగ్యంతోపాటు కోవిడ్ 19 మేనేజ్ మెంట్, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, విభజన అంశాలు, పరిపాలనా సంస్కరణలు, గ్రామ, వార్డు సచివాలయాల బలోపేతం వంటి అంశాలు ఉన్నాయి.వీటితోపాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలతోపాటు ముఖ్యమంత్రి సమయానుగుణంగా కేటాయించే సబ్జెక్ట్ లు చూస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇంతకు ముందు ఉద్దేశపూర్వకంగానే అజయ్ కల్లమ్ అధికారాలను తొలగించినట్లు ఇప్పుడు స్పష్టం అవుతుంది. పైగా వివాదాస్పదంగా మారిన సీనియర్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిపై సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వ్రాసిన లేఖను అజయ్ కల్లమ్ ద్వారా మీడియాకు విడుదల చేయఁచి పెను వివాదం సృష్టించారు. ఈ విషయంలో అజయ్ కల్లమ్ పై కోర్ట్ ధిక్కరణ అభియాగాలు వస్తున్నాయి. 
 
ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఎటువంటి అధికారాలు లేకపోయినా ముఖ్యమంత్రి నిర్వహించే అన్ని సమావేశాలలో అజయ్ కల్లమ్ పాల్గొంటున్నారు. ఇప్పుడు నీలం సాహ్ని కూడా అదే హోదాలో వస్తున్నారు. ఇద్దరు పాల్గొంటారా? చూడవలసి ఉంది. 
 

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

కాగా, ఎపి జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.