ఏపీలో నూతన సంవత్సర వేడుకలు రద్దు 

కరోనా మహమ్మారి రెండో దశ ప్రవేశించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తూ ఉండడంతో రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31, జనవరి 1న వేడుకలను రద్దు చేసింది. ఆ రెండు రోజుల్లో రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. 

రాష్ట్రంలో జనవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదముందని కేంద్ర వైద్య నిపుణులు ఇటీవల హెచ్చరించారు. ఆ నివేదిక ఆధారంగా ఈ నెల మూడో వారం నుంచి మరోసారి కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలను నిషేధించనున్నట్లు తెలిసింది.

ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకూ అన్ని రకాల వేడుకలు రద్దు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది.డిసెంబరు 31న, జనవరి 1న రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ విధించాలని యోచిస్తోంది. వైన్‌ షాపులు, బార్ల సమయాల్ని కుదిస్తారు.  ప్రతి తరగతి గదిలో వేడి నీళ్లు కచ్చితంగా విద్యార్థులకు అందించాలని విద్యాసంస్థలకు ప్రభుత్వం సూచించింది. మాస్కులు అందించడంతో పాటు శాని టైజర్‌ కచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. 

డిసెంబర్ 26 నుంచి టీచర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది తది తరులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. పెళ్లిళ్లకు వంద మందికి మించి హాజరు కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.  రాజకీయ కార్యక్రమాలు, ప్రైవేటు ఈవెంట్లకు 200 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. పెద్ద కర్మలకు 50 మంది, అంత్య క్రియలకు 20 మంది మించకూడదు. 

ఈ కార్యక్రమాలను ప్రభుత్వం సూపర్‌ స్ప్రెడర్స్‌గా పరిగణిస్తుంది. గతంలో ఇలాంటి వాటి వల్లే పదులు, వందల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. ఈ సారి అలా కాకుండా  ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు పెడుతోంది. 

స్విమ్మింగ్‌ పూల్స్‌, క్రీడా కార్యక్రమాలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ పూర్తి నిషేధం విదాస్తున్నారు. తొలి విడత లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగా కఠిన ఆంక్షలను ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిబంధనల అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు, మార్కెట్లు, మాల్స్‌, సినిమా థియేటర్లలో కొన్ని ఆంక్షలు అమలు చేయనుంది. జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని బట్టి కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి మార్కెట్‌ జోన్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తారు. 

మిగిలిన ప్రాంతాల్లో కొంత వరకూ ప్రజలు పనులు చేసుకు నేందుకు అనుమతిస్తారు. ఇదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు చిన్నారులను ఇంటి వద్దనే ఉంచాలని హెచ్చరించారు.  ప్రభుత్వ ఉద్యోగుల్లో హైరిస్క్‌ ఉన్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై ముందుగానే సమాచారమిస్తారు. భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రజలంతా మాస్క్‌, శానిటైజర్‌, మాస్కులను ఉపయోగించడం తప్పని సరి చేయనున్నారు.